పోచమ్మమైదాన్ (వరంగల్), జనవరి 24: తెలంగాణ ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించటం పట్ల వరంగల్కు చెందిన ప్రముఖ కవి, ప్రొఫెసర్ రామాచంద్రమౌళి హర్షం వ్యక్తం చేశారు. ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని, దీనిపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయని తెలిపారు. ఒక ఇల్లుకు పునాదిలా అప్పుడే బడుల్లో బుడిబుడి నడకలతో అడుగుపెట్టే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లిష్ మీడియం మరింత పదును తెస్తుందని వెల్లడించారు. తాను చదువుకున్నపుడు ఉన్న పరిస్థితులు, నేటి పరిస్థితులు, ప్రభుత్వాలు తీసుకొంటున్న నిర్ణయాలపై ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ను బోధనాభాషగా ప్రవేశపెట్టనున్న తరుణంలో మీ స్పందన ఏమిటి?
దేశంలో విద్యావ్యవస్థలను నడిపే బాధ్యులకు మొదటి నుంచి సరైన శ్రద్ధ గానీ, లోతైన అవగాహన గానీ, శాస్త్రీయత గానీ లేకపోవడంతో బోధనామాధ్యమంపై సరైన నిర్ణయం తీసుకోవాలన్న ఆసక్తి రాలేదు. అనేక దశాబ్దాలుగా ఈ సమస్యను వాయిదా వేస్తూ, తాత్సారం చేస్తూ మన పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ప్రాంతమేదైనా, భాష ఏదైనా విద్యార్థికి జ్ఞాన సముపార్జన, జ్ఞానధారణ, జ్ఞాన వినియోగం జరగాల్సి ఉన్నా పాలకుల తీరు అడ్డంపడింది. కొందరు మాతృభాష దురభిమానులు బోధనంతా తెలుగులోనే జరగాలని, దీనివల్ల వాళ్ల సంగ్రహణాశక్తి పెంపొందుతుందని వాదిస్తున్నారు. ఇది నిజం కాదు. మైనపు ముద్దలా ఉండే లేత విద్యార్థి ఏ విషయాన్ని చెబితే దాన్ని అట్టే చదువుకొని ప్రతిభావంతులు అవుతారు. దీనికి సరైన మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉంటుంది. ఆ మార్గదర్శనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది.
ఆంగ్లంపై మీ అనుభవాలు చెబుతారా?
ఇంగ్లిష్.. ప్రపంచవ్యాప్తంగా జనాలకు తెలిసిన విశ్వభాష. అంతర్జాతీయ ప్లాట్ఫామ్పై పనిచేయాలనుకొన్నవాళ్లకు ఇంగ్లిష్ నైపుణ్యం ఉండాలి. లేకుంటే వెనుకబడిపోతారు, అందివచ్చిన అవకాశాలను కోల్పోతారు.
మరి మాతృభాష సంగతేమిటి?
మాతృభాష తల్లిలాంటిది. తల్లితో, కుటుంబసభ్యులతో మాట్లాడటం హృదయ సంబంధమైన వ్యవహారం. కానీ ఉద్యోగం, వృత్తి అట్లా కాదు. అది ఒక సమిష్టి ఉత్పత్తిని ఉత్పాదిస్తూ మానవ సమూహాన్ని ఉన్నతీకరించవలసినవి. ప్రపంచ ప్రజలను సంఘటితపర్చగల ఉమ్మడి భాష ఇంగ్లిషు. ఆ భాష నేర్చుకొని అనర్గళంగా సంభాషించలేనివారు అంతర్జాతీయ వృత్తిలో రాణించటం అసంభవం.
భాషపై మీకు ఎదురైన సంక్లిష్ట అనుభవం చెప్పండి?
నేను పోస్టుగ్రాడ్యుయేట్ చేస్తున్నపుడు రిసెర్చ్లో భాగంగా నా సబ్జెక్టు ‘స్పెషల్ అప్లికేషన్ టేరింగ్స్ యూజ్డ్ ఇన్ రాకెట్ సిస్టమ్స్’. అందులో ఒక సబ్జెక్టు ట్రైబాలజీ అని ఉండేది. నేను దాన్ని ఏదో ఆదిమజాతుల బాపతు అధ్యయనం అనుకొన్నా. మా ప్రొఫెసర్తో ఈ గిరిజనుల సబ్జెక్టు మనకెందుకు సార్ అని అన్నా. అందుకాయన.. అయ్యా! ట్రైబాలజీ అంటే అరుగుదల శాస్త్రం. వేరే సైన్స్ అని చెప్పి ఆ పాఠ్యపుస్తకాన్ని సంపాదించాలని అన్నారు. ఆ సబ్జెక్టుకు సంబంధించి రష్యా వాళ్ల పుస్తకాలే ఉన్నాయి. ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రిసిషన్ ఇంజినీరింగ్ అనే రష్యన్ పుస్తకాన్ని సంపాదించి, దానికి ఇంగ్లిష్ అనువాదాన్ని వెతికి.. మొత్తం మీద మమ అనిపించా. ఇంగ్లిష్ భాషలో పుస్తకం లేకపోవటం వల్ల సమస్య ఎదుర్కొన్నా. దీన్ని బట్టి చెప్పొచ్చేదేమిటంటే మనవాళ్లకు మన తెలుగు భాషా దురభిమానం ఉండకూడదు. దాన్ని గౌరవిస్తూ మాట్లాడుతూ, చదువుతూనే ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్ను తప్పక నేర్చుకొని, ధారాళంగా మాట్లాడగల నైపుణ్యాన్ని సాధించి విశ్వమానవులుగా ఎదుగుదాం. తెలంగాణ ప్రభుత్వ అభ్యుదయ ఆలోచనను శ్లాఘిస్తూ అమలుచేద్దాం. మనం విస్తరిద్దాం.
భిన్నమైన బోధన, భాష నేపథ్యం నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కలిసి పనిచేస్తున్నప్పుడు ఎదుర్కొనే సమస్యలేంటి?
ఒక ప్రాజెక్టులో ఒక ఇండియన్ ఇంజినీర్, ఒక జర్మనీ సైంటిస్టు, ఒక చైనా డిజైనర్ కలిసి చర్చించినప్పుడు వాళ్లు ఏ భాషలో చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలి? ఒకరి భాష ఒకరికి తెలియనపుడు ఎవరిలో ఎంత మేధోశక్తి, నైపుణ్యాలున్నా నిరుపయోగమే. భాష అనేది ఒక భావం, ఆలోచనల వాహిక. అది ఎప్పుడూ కలిసి పనిచేస్తున్న సభ్యులందరికీ బాహాటంగా తెలియాలి.