బెర్లిన్, డిసెంబర్ 7: ఆధునిక జర్మనీ పునర్నిర్మాణంలో కీలకంగా నిలిచిన ప్రగతిశీల రాజకీయవేత్త ఏంజెలా మెర్కెల్ శకం ముగియనున్నది. 16 ఏండ్లక్రితం (నవంబర్ 22, 2005) జర్మనీకి తొలి మహిళా చాన్స్లర్గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఆమె.. సుదీర్ఘ కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన మహిళగా, మూడో రాజకీయ నేతగా ఘనత వహించారు. నాలుగు పర్యాయాలు ఏకధాటిగా జర్మనీ చాన్స్లర్ పదవిలో కొనసాగిన ఆమె ప్రస్థానం డిసెంబర్ 8తో ముగియనున్నది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెర్కెల్కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ కన్జర్వేటివ్ పార్టీ.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ చేతిలో 1.6 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. కరోనా సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారంటూ ఓటర్లు మార్పుకు మొగ్గుచూపారు. తదుపరి చాన్స్లర్గా ఓలాఫ్ స్కాల్జ్ బుధవారం బాధ్యతలు చేపట్టే అవకాశమున్నది.
నిరుద్యోగాన్ని తగ్గించారు
యూరోపియన్ యూనియన్ (ఈయూ)ను ఏకతాటిపైకి తీసుకురావడం, దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి, నిరుద్యోగాన్ని తగ్గించడం వంటి కీలకమైన చర్యలు చేపట్టారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించే ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో వరుసగా గడిచిన పదేండ్లుగా ఆమె నిలుస్తున్నారు.