శాతవాహనులు క్రీ.శ.225 ప్రాంతంలో తెరమరుగైన తర్వాత రాష్ట్ర కూటుల సామంతులుగా వేములవాడ చాళుక్యులు వచ్చేవరకు తెలంగాణలో సుమారు సగభాగం అంటే గోదావరీ ప్రాంత చరిత్రలో పెద్ద వెలితి కనిపిస్తుంది. సుమారు ఐదు శతాబ్దాలు ఉత్తర తెలంగాణ ఏ రాజ్యవంశ పాలనలో ఉందన్నది రికార్డు కాలేదు. కృష్ణా ప్రాంతంలో శాతవాహనుల తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు, విష్ణుకుండి వంశం, బాదామి చాళుక్యులు-ఇలా ఒక నిరంతరత నమోదైంది. మరి ఉత్తర తెలంగాణ చరిత్ర రచనలో ఈ వెలితి ఎందుకు ఉంది? ఆంధ్ర ప్రాంత చరిత్రను తవ్వితీయడంలో ఉన్న ఆసక్తి తెలంగాణపై చూపకపోవడమే ఇందుకు కారణం.
పల్లవుల జాడలు: శాతవాహనుల సామంతులైన పల్లవులు తొలుత కృష్ణకు దక్షిణాన ఉన్నట్టు ఆధారాలున్నాయి. అయితే పెద్దబంకూరు తవ్వకాల్లో 3,700 శాతవాహన నాణేలతో పాటు పల్లవులకు చెందినవని 5 నాణేలు దొరికాయి. దీంతో పల్లవులు శాతవాహనుల తర్వాత కొంతకాలం ఏలినట్టుగా తోస్తున్నది. శాతవాహనరాజు నాణెంపైనా పల్లవ నాణేల్లో ఉన్నట్టు ‘చక్రం’ గుర్తును ముద్రించడం ఇందుకు ఒక ఆధారం.
శాతవాహన రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ఎదిగిన బలమైన వంశాల్లో వాకాటకులు ఒకరు. క్రీస్తుశకం 250 ప్రాంతంలో వింధ్య దిగువన వింధ్యశక్తి రాజు మొదలుపెట్టిన ఈ రాజ్యం దక్షిణ దిశగా వ్యాప్తి చెందింది. వింధ్యకు ఎగువన, ఉత్తర భారతంలో గుప్తులు, మధ్య భారతదేశంలో నాగవంశ రాజులు బలపడుతున్న కాలం అది. అందుకే వీరి వ్యాప్తి దక్షిణ దిశకు సాగింది. నర్మదకు దక్షిణంలో విదర్భ, ఖాందేశ్, మరాట్వాడా, కర్ణాటకలో బీదర్ ప్రాంతం, తెలంగాణలో వీరి రాజ్యం వ్యాపించింది.
ఇక్ష్వాకుల లాగానే వీరు కూడా శాసనాల్లో తమను హారితీ పుత్రులుగా వర్ణించుకున్నారు. ఇది శాతవాహన వారసత్వాన్ని తెలియచేస్తుంది. ఉత్తర భారతంలో ఎదిగిన వంశమైతే హారితీ పుత్రులుగా పిలుచుకునేవారు కాదు. వింధ్య శక్తి కొడుకు మొదటి ప్రవరసేనుడు. ఇతడి తర్వాత వాకాటక రాజ్యం రెండు పాయలుగా విస్తరించింది. ఒకటి నాగపూర్ దగ్గరి నాగార్ధన్ రాజధానిగా ఎదిగిన నందివర్ధన శాఖ, రెండోది మహారాష్ట్రలోని వాషిం రాజధానిగా విలసిల్లిన వత్స్యగుల్మ శాఖ. మొదటి ప్రవర సేనుడి కొడుకు గౌతమీ పుత్ర అధికారంలోకి రాకుండానే కన్నుమూశాడు. గౌతమీపుత్ర అనే పేరు కూడా శాతవాహన సంబంధితమే.
ఈ రెండు శాఖలు కూడా తెలంగాణను ఏలినవే. నం దివర్ధనం శాఖ ఉత్తరం నుంచి ఆదిలాబాద్ వంటి ప్రాం తాలకు నిరంతర భూభాగం కాగా, వాషిం నుంచి మహారాష్ట్రలోని బీడ్, నాందేడ్ల మీదుగా భైంసా, కుబీర్ లాంటి ప్రాంతాలు కలుస్తాయి. అంటే ఉత్తర, పశ్చిమోత్తర దిశల నుంచి తెలంగాణలో వాకాటక రాజ్యం విస్తరించింది. అందుకే వి.వి.మిరాశీ లాంటి చరిత్రకారులు వాకాటక రాజ్యం నర్మద నుంచి తుంగభద్ర వరకు వ్యాపించిందని తేల్చారు. నందివర్ధన శాఖ క్రీ.శ.335-490 వరకు ఉనికిలో ఉంటే, వత్స్యగుల్మ శాఖ క్రీ.శ. 325-510 వరకు అధికారంలో ఉన్నది.
గుప్త వంశ చక్రవర్తి సముద్రగుప్తుడు దక్షిణ భారతాన్ని కూడా జయించాడని అలహాబాద్ ప్రశస్తి (శాసనం) చెప్తుంది. మరి సముద్రగుప్తుడు జయించిన భూ భాగాల్లో తెలంగాణ ఉన్నదా? ఉంటే అప్పటి పాలకులు ఎవరనేది వాకాటక చరిత్రలో దొరుకుతుంది. సముద్రగుప్తుడు ఓడించిన రాజ్యాల్లో వాకాటక కూడా ఉంది. అయితే గుప్తులు ఈ రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోకుండా అధీనస్థ రాజ్యంలాగా వ్యవహరించారు. అజంతా గుహల నిర్మాతలుగా గుప్త- వాకాటక అని రాస్తారు కానీ వాస్తవానికి అజంతాను నిర్మించింది వాకాటకులే. తెలంగాణ అప్పటికే వాకాటక రాజ్యభాగం కాబట్టి ప్రత్యేక ప్రస్తావన లేదు. గుప్త రాకుమారి ప్రభావతిని వాకాటక రాజు రెండో రుద్రసేనుడికి ఇవ్వటం వల్ల కూడా గుప్తరాజ్య ప్రభావం ఈ ప్రాంతంపై ఉన్నది. విష్ణుకుండి రాజైన మాధవ వర్మ భార్య హరిసేనుడి కూతురు వాకాటక యువరాణి మహాదేవి అని విష్ణుకుండి శాసనాలు చెప్తున్నాయి. దీంతో కృష్ణ లోయలో మన ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండి-వాకాటక సంబంధం తెలుస్తుంది.
భారత చరిత్రలో ప్రభావశాలి అయిన మొదటి స్త్రీ ప్రభావతీ గుప్త. రెండవ రుద్ర సేనుడి భార్య అయిన ఈమె రెండో చంద్రగుప్తుడు, నాగవంశ రాకుమార్తె కుబేర నాగ కూతురు. 25 ఏండ్ల వయసులోనే భర్త చనిపోవడం, కొడుకులిద్దరూ చిన్నపిల్లలు కావటంతో సంరక్షకురాలిగా (రీజెంట్గా) ఉంటూ 20 ఏండ్లు పాలన చేసింది. ఒక స్త్రీ ఇంతకాలం పెద్ద భూ భాగంలో రాజ్యమేలి, రాజకీయం నెరిపిన తొలి ఉదాహరణ ఇది. క్రీ.శ.390-410 ఈమె పాలనా కాలం. మహారాష్ట్ర ఆర్కియాలజీ శాఖ, దక్కన్ కాలేజ్ సంయుక్త తవ్వకాల్లో 2016లో నాగార్ధన్లో బ్రాహ్మీ లిపితో ఉన్న ఈమె ముద్రిక దొరికింది. శ్రీశైల మల్లికార్జునుడికి ఈమె మల్లెమాలలు సమర్పించేదన్న సాహిత్య ఆధారం కృష్ణా లోయ వరకు వాకాటక రాజ్య విస్తృతిని తెలుపుతున్నది.
చరిత్రకు ఒక ముఖ్యమైన ఆధారం నాణేలు. కానీ వాకాటకుల నాణేలు ఇప్పటివరకు, తెలంగాణలోనే కాదు, మహారాష్ట్రలో కూడా ఎక్కువ దొరకలేదు. వీరు అప్పటివరకు చెలామణిలో ఉన్న నాణేలను, లేక గుప్తుల నాణేలనే తమవిగా చెలామణి చేసి ఉంటారు. ఆధారాలు దొరకగల అవిభక్త ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో శాస్త్రీయంగా ఉపరితల పరిశీలన, తవ్వకాలు జరగలేదు. ఆదిలాబాద్ జిల్లాలో దొరికిన శాసనాలను పరిష్కరించే పని మొదలుకానేలేదు.
వేల్పుకొండ మొదటి ఆనవాలు అందించనుందా?
బీదర్లో 1986లో ఒక తామ్ర శాసనం దొరికింది. వత్స్యగుల్మ శాఖ రాజైన దేవసేన జారీ చేసిన ప్రాకృత ప్రభావం ఉన్న ఈ సంస్కృత శాసనం క్రీ.శ.460 నాటిదిగా ఎపిగ్రాఫిస్టు పరబ్రహ్మ శాస్త్రి రికార్డు చేశారు. మెదక్ జిల్లాలోని వేల్పుకొండ గ్రామ ప్రస్తావన ఉన్న దాన శాసనం ఇది. దీనిలో ‘సిరిమండపకస్స ఉత్తరా పస్సే కురిథాకాల్లస పువ్వాపస్సే దొనింతమస్స, దక్ఖిణాపస్సే వేల్పకొండా నామ గ్రామహ్’ అని ఉన్నది. ఇప్పటికీ వేల్పుకొండ పక్కనే ఉన్న దోనిగుట్ట ఉంది. శాసనంలో చెప్పిన దొనింతమస్స ఇదేనా అనేది పరిశీలించాలి. ఇది ప్రాథమిక పరిశోధన మాత్రమే. పరిశోధన మరింత జరగాలి. ఇది రాగిరేకుల మీదున్న శాసనం కాబట్టి ఇది బీదర్ చేరుకొని ఉండొచ్చు. బీదర్, మెదక్ జిల్లాల సామీప్యత దృష్ట్యా ఈ శాసనం చాలా విలువైంది.
మన సంస్కృతిలో వాకాటక వారసత్వం
శాతవాహనుల తర్వాత అజంతాలో వారి కంటే ఎక్కువ గుహలను తొలిపించి ప్రపంచ వారసత్వానికి గొప్ప బౌద్ధ గుహారామాలను అందించిన ఘనత వాకాటకులదే. వత్స్యగుల్మ శాఖ రాజైన సర్వసేనుడు రాసిన ‘హరివిజయ’ తొలి ప్రాకృత కావ్యం. కృష్ణుడు సత్యభామ కోసం దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తెచ్చిన ఇతివృత్తం ఇది. ఏకాదశి ఉపవాసాల ఆచారం వీరి కాలంలోనే మొదలైంది. ప్రభావతీ గుప్త ప్రబోధినీ ఏకాదశి ఉపవాసం తర్వాత ఇచ్చిన దానం గురించి రాంటెక్ శాసనం చెప్తుంది. కార్తీకంలో ప్రబోధినీ ఏకాదశి, జ్యేష్ఠంలో నిర్జల ఏకాదశి, మాఘంలో శాత్తిల ఏకాదశి-ఇలా వ్రత సంబంధ చరిత్ర మొదలు ఈ కాలంలోనే దొరుకుతుంది.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000