రాష్ట్ర శాసనమండలిలో ఆరు స్థానాలు భర్తీచేసే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో శాసనమండలి ప్రత్యేకతలేమిటి? ప్రజాస్వామ్యం లో దాని పాత్ర గురించి తెలుసుకోవటం అవసరం. ఈ క్రమంలో శాసనమండలి గురించి భిన్నవాదనలున్నాయి. గతంలో శాసనమండలే అవసరం లేదన్నవారున్నారు. రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చేందుకే ‘శాసనమండలి’ అనే ఆరోపణలూ ఉన్నాయి. ఆ క్రమంలోనే శాసనమండలిని కొన్నిరాష్ర్టాల్లో వద్దనుకున్నారు.
శాసనమండలి గురించి వాదనలెలా ఉన్నా.. ప్రజాస్వామ్యంలో విభిన్న అంచెల్లో చట్టాలు, బిల్లుల రూపకల్పనలో ప్రజాప్రతినిధుల చర్చలకు, శాసనమండలి పాత్ర విశిష్టమైనది. దేశంలో ఆరు రాష్ర్టాల్లో మాత్రమే శాసనమండల్లున్నాయి. మిగతా రాష్ర్టాల్లో శాసనసభలు మాత్ర మే ఉన్నాయి. రాజ్యాంగంలోని 169 ఆర్టికల్ కింద పొందుపరిచి ఉన్న శాసనమండలి ఏర్పాటు కానీ, వాటి ని తీసివేయడం కానీ ఆయా రాష్ర్టాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో శాసనమండలి ఏర్పాటవుతుంది. శాసనమండలి వద్ద న్నా కూడా ఇదే పద్ధతి. తెలుగు రాష్ర్టాలకు సంబంధించి నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రద్దుచేసిన శాసనమండలి తిరిగి వైఎస్ఆర్ హయాంలో పునరుద్ధరించారు. శాసనసభలాగా ఐదేండ్లకోసారి శాసనమండలి రద్దు కాదు. ఇది శాశ్వత సభ. శాసనమండలి సభ్యులు పరోక్షంగా ఎన్నికవుతారు. రెండేండ్లకోసారి మూడొం తుల మంది శాసనమండలికి ఎన్నికవుతుంటారు. శాసనమండలిసభ్యుల పదవీకాలం ఆరేండ్లు. రాష్ట్ర శాసనమండలిలో 40 మంది సభ్యులున్నారు.
రాజ్యసభ, శాసనమండలిలను ‘పెద్దల సభ’ అని కూడా అంటారు. శాసనమండలి కూడా రాజ్యసభలాగే వ్యవహరించాలి. రాష్ర్టానికి సంబంధించిన కీలకమైన అంశాలు, బిల్లులను శాసనమండలిలో చర్చించాలి. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సభ రిజర్వేషన్ రహిత సభ. ఇందులో 1/3 వంతు ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబబడుతారు (14 మంది సభ్యులు), 1/3 వంతు స్థానిక ప్రజాప్రతినిధులచే (14 మంది సభ్యులు), 1/6 వంతు గవర్నర్చే నామినేట్ చేయబడిన వ్యక్తులు (6 మంది సభ్యులు), 1/12 వంతు గ్రాడ్యుయేట్స్ (3 మంది సభ్యులు), 1/12 వంతు ఉపాధ్యాయులచే (3 మంది సభ్యులు) ఎన్నుకోబడిన సభ్యులుంటారు.
విశిష్టత కలిగిన మండలిలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సంస్కరణలు అవసరం. చిన్న రాష్ర్టాలు మినహా రాష్ర్టాల్లో శాసనమండలి వ్యవస్థ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. శాసనసభ ఆమోదించిన బిల్లులను జాయింట్ సెలెక్టివ్ కమిటీకి పంపించాలి. రాజ్యసభకు ఉన్న కొన్ని అధికారాలను శాసనమండలికి బదలాయించాలి. కీలకమైన అంశాలను చర్చించినపుడు జాయింట్సిట్టింగ్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆల్ ఇండియా సర్వీసుల విషయంలో రాజ్యసభకు ఏ విధంగానైతే ప్రత్యేక అధికారాలున్నాయో, రాష్ట్ర సర్వీసులకు సంబంధించి మండలికి ప్రత్యేక అధికారాలుండాలి. జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులు, లోకాయుక్త పరిధిని పెంచే అధికారం శాసనమండలికి ఉండాలి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక సంస్థలకు విడుదలయ్యే నిధుల విషయంలో శాసనమండలికి ప్రాధాన్యం ఉండాలి. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. పారదర్శక పాలనకు పునాది ఏర్పడుతుంది. ప్రజానుకూల పాలనా విధానాలు ఉనికిలోకి రావటంలో శాసనమండలిది విశిష్ట పాత్ర.
కన్నోజు శ్రీహర్ష
89851 30032