‘సోషల్ మీడియా’ నేడు సామాన్యుడికో వరం. తమ అరచేతిలోకి వచ్చిన భావప్రకటనా వేదికలను ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు కూడా గొంతు విప్పే అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలను ఆహ్వానించాల్సిందే. వాటి దుర్వినియోగాన్ని కూడా ఎండగట్టి వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
సామాజిక మాధ్యమాలుగా పిలువబడుతున్న కొన్ని వేదికలు మానవ సంబంధాలను విషతుల్యం చేస్తున్నాయి. కరోనాను మించి సమాజాన్ని అభద్రతకు గురి చేస్తున్నాయి. ఎవరైనా, ఏదైనా మాట్లాడే కట్టుబాట్లు లేని భావప్రకటన నేడు ‘సోషల్ మీడియా జర్నలిజం’గా చెలామణి అవుతున్నది. సామాన్యుడి భావప్రకటనా స్వేచ్ఛ కన్నా, ‘జర్నలిస్టు భావప్రకటన’కు ఏమన్నా ఎక్కువ కొమ్ములున్నయా? వార్తలు, కథనాల పేరుతో నడుస్తున్న యూట్యూబ్లు నీతి, నియమాలకు అతీతమైనవా? అసలు జర్నలిస్టు అంటే ఎవరు? అనే విషయాలు ఆలోచించదగినవి.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల పరిధి దాటి ‘సోషల్ మీడియా’ పెరిగిన తర్వాత సమాచార కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని ‘సత్యానంతర కాల’ పరిస్థితుల్లో ప్రజలున్నరు. కొన్ని మినహా, చాలా యూట్యూబ్ ఛానళ్లు ‘ఫేక్ తంబ్ నెయిల్స్’తో రేటింగుల కోసం అసత్యాలతో రచ్చ చేస్తున్నాయి. సమాజంలోని పెడ ధోరణులన్నీ ఎంత స్వేచ్ఛగా ప్రచారమవుతున్నాయో ఈ సోషల్ మీడియా పేరుతో నడుస్తున్న వాటి తతంగాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ అనేది ఎంత హక్కుగా ఉంటుందో, అంతకంటే ఎక్కువ బాధ్యతతో కూడుకున్నది. జర్నలిజం అంటే పౌరుల పరువుకు, మనోభావాలకు భంగం కలిగించకూడదనే రాజ్యాంగ ప్రాథమిక నియమాన్ని అన్వయించుకొని నిర్వర్తించాల్సిన కర్తవ్యం. నేరం ఆరోపించబడిన వ్యక్తికి కూడా కొన్ని హక్కులు రాజ్యాంగం కల్పించిన నేపథ్యంలో, వాస్తవాస్తవాలతో నిమిత్తం లేకుండా స్వప్రయోజనాల కోసంగా వ్యవహరించటం అప్రజాస్వామికం.
భావ ప్రకటనా ‘స్వేచ్ఛ’ను నిబద్ధతతో వినియోగించుకోవాలి. పత్రికా స్వేచ్ఛ అంటూ ప్రత్యేకంగా వేరే ఏముండదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం నిబంధనలతో కూడిన అందరికీ సంక్రమించిన భావప్రకటనాస్వేచ్ఛనే పత్రికలకు కూడా వర్తిస్తుంది. అదే జర్నలిస్టులకూ వర్తిస్తుంది. పత్రిక నడపాలంటే అనేక నిబంధనలున్నాయి. సమాజంలోని సంఘటనలను ‘వార్త’లుగా రాయలంటే రాజ్యాంగంలోని ‘ప్రెస్ యాక్టు’ విధించిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
‘పత్రిక’ పెట్టాలంటే దాదాపుగా 16కు పైగా నియమ నిబంధనలను ‘రిజిస్ట్రార్ ఫర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా’ (ఆర్ఎన్ఐ) రూపొందించి అమలుచేస్తున్నది. పోలీస్ ఎంక్వైరీ, బ్యాంకు అకౌంట్ల వివరాలు, తదితర అనుమతుల నుంచి జిల్లా కలెక్టర్ వరకూ దశలవారీగా అనుమతులు తీసుకోవాలి. ‘ప్రెస్’ నిబంధనలు ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ అనుసరించాల్సిన పద్ధతులను అమలయ్యేలా చూసేందుకు ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటైంది. కానీ ‘సోషల్ మీడియా’కు ఎటువంటి నియంత్రణ లేదు. ఉన్నది స్వీయనియంత్రణే.
ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజాస్వామిక వాదులమని చెప్పుకొనేవారు మరింత బాధ్యతతో వ్యవహరించాలి. స్వీయ నియంత్రణ పాటిస్తూ భావ ప్రకటనాస్వేచ్ఛను ప్రజల కోసం వినియోగించే బాధ్యత కలిగిన పౌరులమై ప్రతి ఒక్కరూ మెలగాలి. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండే అభిప్రాయాలు వారికి ఉంటాయి. అంతమాత్రాన నచ్చని వ్యక్తుల పట్ల సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం బాధ్యతారాహిత్యమే. ఇప్పటికైనా నిబద్ధత కలిగిన నిఖార్సయిన జర్నలిస్టులు, మేధావులు మేల్కొనకపోతే రానురాను ప్రజలకు మీడియా అంటేనే విశ్వాసం పోతుంది. అది జర్నలిజానికి, ప్రజాస్వామిక వాతావరణానికి గొడ్డలిపెట్టుగా మారి రాజకీయ నియంతృత్వానికి దారితీస్తుంది.
సోషల్ మీడియాలో ‘ఫేక్ న్యూస్’ ప్రచారంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యంగా కొందరు ద్వేషపూరిత ప్రచారం చేస్తుండటం వ్యక్తులకే కాదు, వ్యవస్థకూ తీరని నష్టం, ప్రమాదం కూడా. ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
తమ విద్యుక్త ధర్మాన్ని మరిచి సోషల్ మీడియా ద్వారా ద్వేషాన్ని ప్రేరేపిస్తున్న వారికి కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఓటీటీ, సోషల్మీడియా వేదికలను ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాల నుంచి జైలుశిక్షల వరకు విధిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులకు జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కఠిన శిక్షలున్నాయి. ట్విటర్, గూగుల్, వాట్సప్లను చైనా నిషేధించింది. రష్యా, ఐరోపా దేశాల్లోనూ సోషల్ మీడియాపై నియంత్రణ చర్యలున్నాయి.
సోషల్ మీడియాలో ‘ఫేక్ న్యూస్’ ప్రచారంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యంగా కొందరు ద్వేషపూరిత ప్రచారం చేస్తుండటం వ్యక్తులకే కాదు, వ్యవస్థకూ తీరని నష్టం, ప్రమాదం కూడా. ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా పరిగణనలోకి తీసుకోవా లి. హద్దుమీరి వ్యవహరిస్తున్న నెటిజన్ల విపరీత పోకడలను కట్టడి చేయవలసిన అవసరం ఉన్నది.
భావ ప్రకటనా స్వేచ్ఛ గొప్పది. అది దుర్వినియోగం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం అంతకంతకూ పెరుగుతున్నది. ఒక చిన్న పత్రికను నడుపాలంటేనే ఎన్నో నిబంధనలున్న నేపథ్యంలో యూట్యూ బ్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమ వేదికల్లో విచ్చలవిడితనానికి తావులేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నది. ప్రెస్ చట్టంలోని నిబంధనలు కేవలం మెయిన్ స్ట్రీం మీడియాకే కాదు, సోషల్ మీడియాకూ వర్తింపజేయాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు భారతీయ ప్రెస్ చట్టం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆర్ఎన్ఐ వంటి చట్టాల వెలుగులోంచి పరిశీలించాలి. దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
రమేశ్ హజారి
93909 19090