‘సార్ తెలంగాణలో ధాన్యం బాగా పండింది. మీరు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి. పంజాబ్ రైతులెంతో తెలంగాణ రైతులూ అంతే. మీరు ఎలాగైనా ధాన్యం కొనాలి. ప్రధానికి మా సమస్యను మీరు బ్రీఫ్ చేయండి. మీరు చెప్పాక మేం వెళ్లి కలిస్తే ప్రధాని మా రైతులకు అనుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశ.’‘ధాన్యం సంగతి తర్వాత.. మీ తెలంగాణలో ఏమేమున్నాయి ?’
‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంటే కరువు, రైతుల ఆత్మహత్యలకు మారు పేరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. మీకో విషయం తెలుసా? కరీంనగర్లో పంటలు గోదావరి జిల్లాలను దాటిపోయాయి. ధాన్యమే కాదు చిరుధాన్యాలు, పసుపు, పత్తి, మిర్చి అదీ ఇదీ అని కాదు అన్ని పంటలు విరగ పండుతున్నాయి.’
‘అబ్బా ఎప్పుడూ పంటల గురించేనా?.. తెలంగాణలో ఏమున్నాయి అవి చెప్పండి ?’
‘ఓహో అర్థమైందండీ.. కేంద్రమంత్రి గారు తెలంగాణలో పర్యటించాలనుకుంటున్నారు కదూ. గోల్కొండ, చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, ఇటీవలే అద్భుతంగా నిర్మించిన యాదాద్రి మీరు వస్తానంటే చెప్పండి చూసేందుకు బోలెడున్నాయి ..’
‘సింగరేణి కూడా ఉంది కదా’, ‘ఔను పరిశ్రమలు చూసే ఆసక్తి ఉందంటే చెప్పండి బొగ్గు నుంచి ఐటీ వరకు విమానాల తయారీ నుంచి ఔషధ నగరి వరకు అన్నీ ఉన్నాయి. చూడొచ్చు.’
‘అంత స్పీడ్గా చెప్తే ఎలా ఒక్క నిమిషం ఉండండి. నోట్ చేసుకుంటాను .’, ‘ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి జిల్లాలో అద్భుతమైన నిర్మాణాలున్నాయి. మీరు వస్తే దగ్గరుండి చూపిస్తాం. కానీ ధాన్యం కొనమని ప్రధానికి ఓ మాట చెప్పండి’, ‘మీరు ఇక్కడే ఉండండి. నేను ప్రధానిని కలిసి ఈ జాబితా ఇచ్చాక మీరు వెళ్లండి’, ‘థాంక్స్ కేంద్ర మంత్రిగారు. ధాన్యం కొనడానికి ప్రధానిని ఒప్పించేందుకు మీ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు..’
‘హా.. హా.. ఎవరయ్యా మీకు చెప్పింది. ధాన్యం
కొనేందుకు నేను ప్రధానిని ఒప్పిస్తానని. ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నా మీకు ఇంకా కమలం రాజకీయం అర్థం కాలేదు. అమ్మడమే మా పాలసీ, కొనే ప్రసక్తే లేదు. ప్రధానికి నేనిచ్చే జాబితా మీ రాష్ట్రంలో చూడదగిన ప్రదేశాలవి కాదు. అమ్మదగిన ఆస్తులవి. మీ రాష్ట్రంలో అమ్మడానికి ఏమేం ఉన్నాయో చెప్పండి వెంటనే అమ్మేస్తాం. అంతేకానీ కొనే ప్రసక్తే లేదు.’
‘అదేదో ప్రధాని తోనే తేల్చు కుంటాం .’
‘సరే వెళ్ళండి’
తెలంగాణ మంత్రులు వినతిపత్రంతో గదిలోకి వెళ్లగానే అక్కడి దృశ్యం వారికి ఆశ్చర్యం కలిగించింది. ప్రధాని రాజకీయాల్లో అంత బిజీగా ఉంటూ కూడా ఓ విద్యార్థి మాదిరిగా ఇండియా మ్యాప్ను తీక్షణంగా చూస్తు రాసుకుంటున్నారు. గ్రేట్ అనుకున్నారు మంత్రులు. ‘అంత తీక్షణంగా మ్యాప్ చూస్తూ ఏం రాసుకుంటున్నారు సార్’ తెలంగాణ మంత్రులు కోరస్గా పలకరించారు. ‘మీ విద్యార్హతలపై వార్తలు చూసి ఏమేమో అనుకున్నాం. మీరు నిత్య విద్యార్థి అని కళ్లతో చూస్తున్నాం’ అన్నారు.
ప్రధాని సంతూర్ యాడ్లోలా నవ్వి.. ‘ఓహో అదా మీ అనుమా నం. నేనా.. విద్యార్థినా!.. కాదు. అమ్మడం.. అమ్మడం. ఇదే మా పార్టీ పాలసీ. బ్యాంకులు, ఎయిర్ ఇండియాలు విజయవంతంగా అమ్మేశాం. బీపీసీఎల్ అమ్మకానికి పెట్టాం. జిందగీకే సాత్ బీ జిందగీకి బాద్ బీ అని చెప్పిన ఎల్ఐసీని అమ్మకానికి పెట్టి ఎల్ఐసీ జిందగీనే ప్రశ్నార్థకంగా మార్చాం. కరోనా తర్వాత ఎవరి జీవితానికి భరోసా లేదని తేలిపోయింది. అలాంటప్పుడు జీవితానికి భరోసా ఇస్తాం అని ఎల్ఐసీ చెప్పడం తప్పే కదా అందుకే అమ్మేస్తున్నాం. ఇండియా మ్యాప్లో ఇంకా అమ్మడానికి ఏమున్నాయా? అని భూతద్దాలు పెట్టుకొని చూడాల్సి వస్తున్నది.’
‘అదేంటి సార్ మీ మార్క్ చూపాలంటే మీరు కొత్తవాటిని నిర్మించాలి. కానీ ఎప్పుడో నిర్మించిన వాటిని అమ్ముకోవడం కాదు.’
‘విధ్వంసం తర్వాతే పునర్నిర్మాణం జరుగుతుందని మీకు తెలుసు కదా? ప్రస్తుతం నేను విధ్వంసం చేస్తున్నాను. పూర్తికాగానే పునర్నిర్మాణం జరుగుతుంది.’
‘ఆహా.. ఇంకేమున్నాయి సార్ మీరు అమ్ముకోవడానికి?’, ‘నేల, నింగి, గాలి, నీరు అది ఇదీ అని కాదు పంచభూతాలను అమ్మాలనేదే నా జీవితాశయం.’, ‘నిజంగానే ఇప్పటివరకు పనిచేసిన ప్రధానులందరి కన్నా మీరు ప్రత్యేకం ప్రధాని గారు. నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ వరకు తమ హయాంలో ఇది నిర్మించామని చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంది. వారంతా నిర్మిస్తే నేను అమ్మేశాను అని చెప్పుకొనే ఛాన్స్ మీ ఒక్కరికే సొంతం. మీ స్పీడ్ చూస్తుంటే దేశాన్ని ఏం చేస్తారా అనే భయం వేస్తోంది.
– కౌటిల్య