కాలగర్భంలో కలిసిపోయిన బోధగయను బర్మా బౌద్ధులు, 1880లలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తిరిగి నిలిపి బౌద్ధ ప్రపంచానికి అతి ముఖ్యమైన చారిత్రకస్థలాన్ని అందజేశారు. అట్లాగే 1897లో ఏ ఫ్యూరర్, 1901లో జనరల్ ఖడ్గ షంషేర్ రాణా.. బౌద్ధసాహిత్యం, ఫాహియాన్, హ్యూయన్త్సాంగ్ వంటి చైనా యాత్రికుల రచనల ఆధారంగా నేపాల్లోని లుంబినిలో బుద్ధుడి జన్మస్థలం, అక్కడే మాయాదేవి మందిరం, అశోకుడి శిలా శాసనం కనుగొన్నారు. మరి తెలంగాణకు బౌద్ధాన్ని తెచ్చిన బావరి గోదావరీ తీరంలో ఎక్కడ ఉండేవాడో కనుక్కోవడం తెలంగాణ బౌద్ధ వారసత్వానికి, చరిత్రకు అవసరం.
బాదనకుర్తిలో ఏముంది?: బౌద్ధ సాహిత్యంలో సుత్త నిపాతలోని పారాయణ వగ్గ అధ్యాయంలో పేర్కొన్న చీలిన గోదావరి పాయల్లో వెదకటం చేయాల్సిన మొదటి పని. ఈ పని 1990లలో ఠాకూర్ రాజారాం సింగ్ మొదలుపెట్టి నిర్మల్ జిల్లా బాదనకుర్తిలో ఉన్న ద్వీపాన్ని బావరి స్థలంగా చెప్పారు. దాని ఆధారంగా ఆర్కియాలజీ శాఖ అధికారులు ప్రాథమిక సర్వే చేసినా సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. ఇదే క్రమంలో ఈ వ్యాసకర్త రెండేండ్ల కింద మరొక నిపుణుడి సాయంతో చేసిన పరిశోధనలో బాదనకుర్తిలో ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. ఏ దిబ్బను బావరి కాలం నాటిదిగా భావిస్తున్నారో అక్కడ తొలి చారిత్రక కాలానికి సంబంధించిన ఇటుకలుగానీ, మట్టిపొరల్లో ఏర్పడే మార్పులుగానీ కనిపించలేదు. ఒక గద్దె మీద తాబేలు బొమ్మపై ఉన్న పాదాలు మధ్యయుగం నాటివి. బహుశా ఇక్కడ దత్తాత్రేయ మందిరంలో ఉన్న తాబేలు బొమ్మ గోండుల టోటెమ్ (కుదురు చిహ్నం) చిహ్నం అయి ఉంటుంది. ఆ తాబేలుపై ఉన్న పాదా లు దత్తాత్రేయ ఆరాధన ప్రారంభమైన మధ్యయుగం నాటి చరిత్రను చెబుతుంది. బాదనకుర్తిలో ఉన్న గోండుల కోట కూడా మధ్యయుగానిదే. అందు కే ఇప్పటికైతే బాదనకుర్తిలో బావరి ఆధారాలు స్పష్టంగా లేవనే చెప్పవచ్చు. అయితే గోదావరి మనల్ని ఎన్నడూ నిరాశపరచలేదు. ఇంకో గోదావరి పాయ మధ్య బావాపూర్ కుర్రు రూపం లో మనకు ఒక పురాతత్వ ఆధారం ముందుకు వచ్చింది.
బావాపూర్ కుర్రు.. ఆధారాల వైపు తొలి అడుగు: నిర్మల్ జిల్లా బాదనకుర్తికి 12 కి.మీ. దూరంలో గోదావరి దిగువన బావాపూర్ కుర్రు దగ్గరున్న గోదావరి పాయల మధ్య ఒక చిన్న ద్వీపంలో దొరికిన ఆధారం కొత్త అన్వేషణకు తెరతీసింది. కేయూ పరిశోధక విద్యార్థి, స్థానిక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న డి.సంతోష్ తొలిసారి బావాపూర్ కుర్రు పక్కన గోదావరి మధ్య ద్వీపంలో ఒక మట్టి దిబ్బను, అక్కడ పడి ఉన్న ఇటుకలను గుర్తించి బుద్ధవనం అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఒక కొత్త ఆధారం వెలుగులోకి వచ్చింది.
మట్టి దిబ్బ మీద ఉన్న చెట్లను తొలగిస్తే చతురస్రాకారంలో, మూడు వరుసలలో, రాతి అమరిక మధ్య ఇటుకలతో ఉన్న ఒక స్తూపం వంటి నిర్మాణం బయటపడింది. బయటివైపున్న రాతి వరుస 19 మీటర్ల పొడవు, దాదాపు అంతే వెడల్పు ఉంది. మధ్యభాగంలో ఉన్న ఇటుకలు, చెల్లాచెదురై పడి ఉన్న ఇటుకల్ని బట్టి చూస్తే ఈ స్తూపాన్ని ఇటుకలతో కట్టినట్లుగా భావించాలి. రెండవ, మూడవ వరుసల మధ్య స్తూపం చుట్టూ ఉన్న ప్రదక్షిణ పథం ఉండాలి. ఇటుకలతో కట్టిన స్తూపం వంటి మధ్యభాగంలో తవ్వకాలు చేస్తే మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశం ఉంది.
ఇతర ఆధారాలు: ఇదే ద్వీపంపై ఇంకో నాలుగు చోట్ల వృత్తాకారంలో ఉన్న ఇటుకలు మట్టి పొరల కింద కనిపిస్తున్నాయి. ఇవి ప్రధాన స్తూపానికి అనుబంధంగా ఉన్న చిన్న స్తూపాలు కావచ్చు. ఇంకో రెండు చోట్ల ఇటుకలతో కట్టిన గోడల వంటి నిర్మాణాలు రెండు గుంతలలో బయటకు కనిపిస్తున్నాయి. ఇవి బహుశా నివాస గదులు కావొచ్చు. ఇక్కడ దొరికిన ఇటుకలు కూడా విశేషమైనవే. స్తూపాల్లాంటి వృత్తాకార నిర్మాణాల మలుపుల కోసం, ఎన్నో ఆకారాల్లో, సైజుల్లో ఉన్న ఇటుకలు దొరికాయి. 56x26x12 సెం.మీ. సైజున్న ఇటుకలు తొలిచారిత్రక యుగం నాటివని మనకు పురావస్తు శాస్త్రం చెబుతుంది. త్రిభుజాకారం, సమాంతర చతుర్భుజం, చతుర్భుజం , ‘వి’ఆకృతి, ఇలా ఎన్నో ఆకారాల్లో ఉన్న ఇటుకలు విస్తృతంగా ఇక్కడ దొరకడంతో ఇటుకల నిర్మాణంలో జరిగిన ప్రయోగం కనిపిస్తుంది.
బావాపూర్ కుర్రు మనకు ఏమి చెపుతున్నది? సుత్త నిపాతలో తెలంగాణ నేలకు బౌద్ధాన్ని తెచ్చిన బావరి వృత్తాంతం ఒక కాల్పనిక కథ కాదని తెలిసినా, పురావస్తు ఆధారాలు లేకుండా మనం చరిత్ర రచన చేయలేం. బావరి జాడల్ని మనం వెతకగలిగితే తెలంగాణలో క్రీస్తుపూర్వం 6వ లేదా 5వ శతాబ్దానికి చెందిన పురావస్తు ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణలో పురావస్తు పరిశోధనకే తలమానికంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకున్న పురావస్తు ఆధారాలు శాతవాహన పూర్వ రాజులు, శాతవాహనుల కాలం నాటివే (క్రీస్తుపూర్వం 200 నాటివి).
బావాపూర్ కుర్రులో ఇప్పటివరకు జరిగిన పరిశోధన చాలా ప్రాథమికమే. ఇందులో మనకు తొలినాళ్ళ స్తూపం వంటి నిర్మాణం కనిపిస్తున్నది. ఇది బావరి కాలం నాటిదని ఇప్పుడే చెప్పలేం కానీ ఈ దిశగా మొదటి పురావస్తు పరిశోధన ప్రయత్నంగా భావించాలి. ఈ మట్టి దిబ్బ, చుట్టూ ఉన్న ఇటుకల నిర్మాణాలు, పరిసరప్రాంతాల్లో శాస్త్రీయ ఉపరితల పరిశోధన (scientific clearance), ఆ తర్వాత తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
బావాపూర్ కుర్రు మనకు ఏమి చెపుతున్నది?: సుత్తనిపాతలో తెలంగాణ నేలకు బౌద్ధాన్ని తెచ్చిన బావరి వృత్తాంతం ఒక కాల్పనిక కథ కాదని తెలిసినా, పురావస్తు ఆధారాలు లేకుండా మనం చరిత్ర రచన చేయలేం. బావరి జాడల్ని మనం వెతకగలిగితే తెలంగాణలో క్రీస్తుపూర్వం 6వ లేదా 5వ శతాబ్దానికి చెందిన పురావస్తు ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణలో పురావస్తు పరిశోధనకే తలమానికంగా నిలుస్తుంది. ఇప్పటివరకు మనకున్న పురావస్తు ఆధారాలు శాతవాహన పూర్వ రాజులు, శాతవాహనుల కాలం నాటివే (క్రీస్తుపూర్వం 200 నాటివి).
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000