బాదామి చాళుక్యుల ఆధారాలున్న ప్రాంతం కృష్ణా-తుంగభద్రల సంగమ స్థలం జోగులాంబ-గద్వాల జిల్లాలోని అలంపూర్ పట్టణం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. వీరి రాజధాని బాదామి, ప్రముఖ కేంద్రాలైన ఐహోళె, పట్టడకల్ తర్వాత అంతటి గొప్ప నిర్మాణాలున్న పట్టణం అలంపూర్. బాదామి చాళుక్య చరిత్రకు ఆధారాలు ఇక్కడి అద్భుతమైన ఆలయాలు, శాసనాలు. వీటిలో కూడలి సంగమేశ్వర ఆలయం ఒకటి. నాగర్ కర్నూల్ జిల్లా వడ్డెమాను, చిన్న మారూరు, పెద్ద మారూరు, ఆముదాలపాడు, పల్లిపాడు, వనపర్తి జిల్లా పానగల్లు – ఇవన్నీ బాదామి చాళుక్యుల శాసనాల్లో ప్రస్తావించిన గ్రామాలు.
తెలంగాణ చరిత్రను ఒక పద్ధతిలో, క్రమబద్ధంగా, ఖాళీలను పూరిస్తూ రాసే ప్రయత్నంలో ఒక ప్రశ్నకు సమాధానంగా వంద సందేహాలు మొలకెత్తుతున్నాయి. శాతవాహనుల ఆధారాలు
విస్తారంగా దొరికి, ఇక్ష్వాకులు వచ్చేనాటికి.. కృష్ణా లోయలో సరే మరి గోదావరి లోయలో తెలంగాణ చరిత్ర ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా వాకాటక పాలన ముందుకొచ్చింది.
ఇక విష్ణుకుండి జన్మస్థలం నుంచి మొదలు విస్తృతి వరకు, అస్పష్టత నుంచి స్పష్టతకు వచ్చేందుకు, తుమ్మలగూడెం రాగి రేకులు, చైతన్యపురి శిలాశాసనం, కీసర తవ్వకాలు మనకు సహాయం చేసినాయి.
దీంతో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి అస్సక మహా జనపదం నుంచి క్రీస్తుశకం 624 వరకు అంటే విష్ణుకుండి పాలన కనుమరుగయ్యే వరకు తెలంగాణ చరిత్రలోని విస్మృతులను గుర్తించి ఖాళీలను పూరిస్తూ ముందుకు వస్తే మళ్లీ ఒక ప్రశ్న ముందుకొస్తుంది.
విష్ణుకుండి పతనం క్రీ.శ.624 ప్రాంతంలో జరిగి, ఇంకో 129 ఏండ్లకు అంటే క్రీ.శ.753లోరాష్ట్రకూటులు, సరిగ్గా అదే సమయంలో వారి సామంతులుగా వేములవాడ చాళుక్యులు వచ్చేవరకు తెలంగాణ ఎవరి పాలనలో ఉంది అన్నదే ఆ ప్రశ్న.
తెలంగాణ చరిత్ర రచనలో ఈ సమస్యకు మూలం ఇప్పటివరకు పాటించిన పద్ధతిలో ఉంది. తెలంగాణ ఒకనాటి హైదరాబాద్ రాజ్యంలో, ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నంతకాలం దక్కన్ మొత్తాన్ని ఒక చారిత్రక-భౌగోళిక యూనిట్గా చూస్తూ పరిశోధనలు, తవ్వకాలు జరిగినాయి. అందుకే కర్ణాటకలోని సన్నతి, మహారాష్ట్రలోని అజంతాల చరిత్ర మన చరిత్రతో పెనవేసుకుపోయింది. 1956 తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమైన తర్వాత దక్కన్లోని మహారాష్ట్ర, కర్ణాటకలతో సంబంధం పోయింది. అందుకే మహారాష్ట్రలో మొదలైన వాకాటకులు, కర్ణాటకలో వచ్చిన బాదామి చాళుక్యల వంటి వారి చరిత్ర మీద దృష్టి పెట్టలేదు. సరిగ్గా ఇక్కడే మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఖాళీలు కనిపిస్తున్నాయి.
బాదామి చాళుక్యుల చేతిలో విష్ణుకుండి పాలన అంతమైంది. అప్పటివరకూ విష్ణుకుండి రాజ్యంలో భాగమైన తెలంగాణ.. బాదామి చాళుక్యుల రాజ్యంలో కలిసిపోయింది. బాదామి అనేది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్న ఒక చారిత్రక పట్టణం. దీని పాత పేరు వాతాపి. వాతాపి అనగానే ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అని తల్లులు పిల్లలకు ముద్దలు పెట్టి చెప్పే వాక్యం, లేక ‘వాతాపి గణపతిం భజే’ అనే కీర్తన మదిలో మెదులుతుంది. వాటి సందర్భం, వ్యుత్పత్తి ఆ కాలంలో మత పరిస్థితులను చర్చించే సందర్భంలో చెప్పుకొందాం. అయితే ఈ వాతాపి దాదాపు క్రీస్తు శకం 566 ప్రాంతంలో ఉత్తర కర్ణాటక, కొంకణ్ ప్రాంతాలను ఏలిన కదంబ రాజ్యం నుంచి విడిపడి స్వతంత్రంగా ఎదుగుతున్న ఒక రాజ్యానికి రాజధాని. దక్కన్ ప్రాంతంలో ఒక భాగం.
బాదామి చాళుక్యుల ఆధారాలు అనేక గుడులు, శాసనాలరూపంలో దొరికినప్పటికీ వారికాలం నాటి నాణేలు దొరుకకపోవటం పరిశోధించాల్సిన అంశం. తెలంగాణ మొత్తం వీరి పాలన కింద ఉన్నా కేవలం పాత మహబూబ్నగర్ జిల్లాలో అందులోనూ కృష్ణా-తుంగభద్ర అంతర్వేది ప్రాంతాల్లో తప్పించి తెలంగాణలో ఎక్కడా వీరి ఆధారాలు దొరుకకపోవడం కూడా చర్చనీయాంశం.
బాదామి చాళుక్యులు ఎక్కడి వాళ్ళు?
కృష్ణా పరీవాహక ప్రాంతంలో వచ్చిన ఇక్ష్వాకు రాజ్యంలో చాళుక్య అనేది ఒక ‘విషయం’ (మండలం, రాష్ట్రం లాగా విషయం అనేది నాటి పరిపాలన యూనిట్). ఇక్కడినుంచి ఎదిగిన వాళ్లు కాబట్టి వీరి పేరు చాళుక్యులు అనేది ఒక ప్రతిపాదన. నాగార్జునకొండలో దొరికిన ఒక ఆయక స్తంభ శాసనంలో ‘మహాసేనాపతిస మహాతలవరిస వాసిఠీపుతస హిరమ్ణకానామ్ ఖంద చళికి రెమ్మణకస’ అని ఉంది. ఇందులో ఈ ఆయక స్తంభాన్ని నిలుపుతున్న చాంతిసిరిణిక అనే స్త్రీ హిరమ్ణక కుటుంబానికి చెందిన చళికి మహా సేనాపతి మహాతలవర అయిన రెమ్మణక భార్య. ఇక్కడ ప్రస్తావించిన ‘చళికి’ ఇంకో రూపమే ‘చళుక’, దాన్నుంచి వచ్చిన పదమే చాళుక్య. ఈ ‘చళికి’ కృష్ణా తుంగభద్రల ప్రాంతమైన నాగర్కర్నూల్-కర్నూల్ ప్రాంతమే. ఇక్కడే ప్రస్తావించిన ‘హిరమ్ణక’ వంశం కూడా దాదాపు ఇదే ప్రాంతానికి సంబంధించినదే అని చరిత్రకారులు ఇతర సందర్భాల్లో కూడా గుర్తించారు.
దీన్నిబట్టి ఇక్ష్వాకుల కాలంలో కృష్ణా-తుంగభద్ర తీరాల్లో ఉన్న వీరు విష్ణుకుండి కాలంలో మలప్రభ లోయకు (కృష్ణకు ఇంకో ఉపనది, బాదామి ఇదే నదీ తీరంలో ఉంది) చేరుకొని ఉండాలి. అక్కడ వీరు కదంబ వంశ సామంతులుగా ఉండి వారిని ఎదిరించి, ఓడించి స్వతంత్రులైనారు. విష్ణుకుండి చివరి రాజైన మంచన భట్టారక ఓటమితో వీరి విశాలమైన బాదామి చాళుక్య రాజ్యం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతోపాటు తెలంగాణలో కూడా స్థిరపడింది. అంతేకాదు కొంత కాలంపాటు పల్లవులను ఓడించి తమిళనాట కొంతభాగం చేర్చుకుంది. తూర్పున కళింగ వరకు గెల్చుకొని వేంగీ చాళుక్య రాజ్యం (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఇందులో భాగమే) ఏర్పాటుకు కారణమైంది. మిగతా రాజవంశాల పుట్టుకకు పుక్కిటి పురాణాలు (myths) ఉన్నట్టే చాళుక్యులకు కూడా ఉన్నాయి. బ్రహ్మ అర్ఘ్యం ఇవ్వడానికి పట్టిన దోసిలిలోంచి పుట్టిన వీరుడు చాళుక్యుడని, అందుకే వీరి వంశం చాళుక్య వంశం అని కథ. చిన్నస్థాయి నుంచి బలీయమైనవిగా మారుతున్న రాజవంశాలకు సాధికారతను తెచ్చేందుకు ఇటువంటి కథలు ఉపయోగపడుతాయి తప్ప వాస్తవం కాదు.
హారీతీ పుత్రులు
శాతవాహనులు మొదలు విష్ణుకుండి వరకు అందరూ తమనుతాము హారీతీపుత్రులుగా వర్ణించుకున్నవాళ్లే. హైదరాబాద్లోని బేగంబజార్లో మహేంద్ర శాంతయ్య అనే ఒక జైన గురువు దగ్గర రెండవ పులకేశి క్రీ.శ.613లో జారీచేసిన తామ్ర శాసనం (రాగిరేకుల మీద ఉన్న శాసనం) దొరికింది. ఇందులో ‘మానవ్యస గోత్రాణాం హారీతీ పుత్రాణాం’ అని చెప్పుకొన్నాడు. ఇక నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ దగ్గర ఆముదాలపాడులో దొరికిన, క్రీ.శ.660లో మొదటి విక్రమాదిత్య జారీచేసిన తామ్ర శాసనంలో సైతం ‘హారీతీ పుత్రాణాం’ అని వర్ణించుకున్నారు. ఇది మొత్తం దక్కన్ ప్రాంత ప్రత్యేకత. ఉత్తర కర్ణాటకను పాలించిన కదంబులు కూడా హారీతీపుత్రులే.
అసలు అలంపూర్ పేరు ఎప్పటిది?
ఇక్ష్వాకుల ‘హల’ నుంచి వచ్చిన హలంపురమా లేక ఎల్లమ్మ పేరిట వచ్చిన అలంపురమా? అలంపూర్ ఆలయాలు వాస్తు శిల్ప కళారీతుల్లో ఏ కొత్త మార్గం తీసుకున్నాయి? ఇంత పెద్ద బాదామి చాళుక్య రాజ్యం ఆనవాళ్లు మిగతా తెలంగాణలో ఎందుకు దొరకలేదు? ఇలాంటి కొన్ని విషయాల్నీ, ఇంకా అర్థంకాని చిక్కుముడుల్నీ, ప్రజల జీవితంలో పెనవేసుకొని ఉన్న ఎల్లమ్మ కథనీ ముందుముందు చర్చించుకుందాం.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000