‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/ సకిలించు ఆంధ్రుడా! చావ వెందుకురా!?’ అన్ని భాషలు నేర్చుకో. కానీ నీ మాతృభాషను మాత్రం మరవద్దని చెప్పిన మహానుభావుడు కాళోజీ. ఏది కావాలన్నా తొలుత ‘మనిషి’ కావాలి. కాళోజీ మనసున్న మనిషి. ఆయనకు ఆయనే సాటి. మార్క్సిస్టు పరి భాషలో చెప్పాలంటే ఆయన ఆదర్శవాది, మానవతావాది. నిరంతర సృజన శీలి. ఆయనొక సామాజిక తత్వవేత్తగా, ఆలోచకునిగా, దార్శనికునిగా ఎల్ల కాలాల్లో ప్రజా కవిగా కానవచ్చే నిష్ఠా గరిష్ఠుడు.
రంగారావు, రమాబాయమ్మల రెండవ కుమారుడు కాళోజీ. కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజ్. కర్ణాటకలోని రట్టహళ్లి గ్రామంలో 1914, సెప్టెంబర్ 9న కాళోజీ జన్మించారు. ‘కాళన్న’గా తెలంగాణ ప్రజలకు సుపరిచితులు. రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం మన కాళోజీ. హక్కులు అడిగిన ప్రజల మనిషి. విద్యార్థి దశ నుంచే విప్లవ స్పృహ కలిగిన ఉద్యమ జీవి. తెలంగాణ జీవిత చలన శీలి. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజా కవి. స్వాతంత్య్ర సమరయోధుడు. బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. కాళోజీ సేవలను గుర్తించి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ పొందిన మహనీయుడు కాళోజీ. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పుట్టిన రోజైన ‘సెప్టెంబర్ 9’ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్నది. 2015లో కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఏటాప్రముఖ సాహితీవేత్తలకు ఆ అవార్డును ప్రదానం చేస్తున్నది.
కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తెలంగాణ భాష, యాసను తరతరాలకు తెలిసేలా రచనలు చేశారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయన దిట్ట. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించారు. కవిత్వాలతో, గేయాలతో ప్రజలను నిద్ర లేపిన ఆయనకు మనిషితనం పట్ల అమితమైన ప్రేమ. తెలంగాణ యాసపై విపరీతమైన అభిమానం. ఆయన ధిక్కార కవిత్వమంతా తెలంగాణ మాండలికంలో సాగింది.
At least there cannot be an international style in poetryఅన్నాడు W.H.Audaen. తెలుగులో వచన కవిత్వాన్ని తమ నిర్దిష్టమైన మాండలిక భాష ద్వారా, మౌఖిక సంప్రదాయాన్ని ఏదో ఒక స్థాయిలో కవిత్వంలో ప్రవేశపెట్టడం ద్వారా కాళోజీ లాంటి వాళ్లు తెలుగు కవిత్వాన్ని Audaen చెప్పిన international style నుంచి కాపాడారు. కాళోజీ తన భాషా సోయిని తెలుగు ప్రాంతాలన్నింటికి కూడా వ్యాపింపజేసిన వ్యవహార దక్షుడు. బడి పలుకుల భాష కాదు, పలుకు బడుల భాష గావాలెనని వ్యావహారిక భాషను అందలమెక్కించిన భాషావాది కాళోజీ. తెలంగాణ భాషను ఈసడింపుగా చూసే వారిని చూసి ఆయన భాషా కోపం నషాళానికి అంటుకునేది. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు లాంటి వారెందరికో సాహిత్యంలో, రాజకీయాల్లో మార్గ నిర్దేశం చేసిన మహా మనీషి ఆయన. శతాబ్దపు జీవన ప్రయాణంలో ప్రతి నిమిషం పోరాటాన్ని శ్వాసించి, కవిత్వీకరించిన వ్యక్తి కాళోజీ.
‘నేను ప్రస్తుతాన్ని,
నిన్నటి స్వప్నాన్ని,
రేపటి జ్ఞాపకాన్ని’ అంటూ..
ఒక్క మాటలో తన వస్తు తత్వాన్ని చెప్పారు.
‘నవ యుగంబున నాజీ నగ్న నృత్యమింకెన్నాళ్ళు…
హింస పాపమని ఎంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్లు…’ అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన యోధుడు కాళోజీ.
‘అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట’ అం టూ బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి భూస్వామ్యవాదాన్ని తిరస్కరించిన ప్రజావాది. సాహిత్య ప్రవేశానికి ముందు కాళోజీ గొప్ప కథకుడు కావాలనో, కవిని అనిపించుకోవాలనో అనుకోలేదు. కాళోజీ కవిత కాలం ప్రవహిస్తున్న వ్యథ. ఇవ్వాళ నేను కవిత్వం చెప్పేది ‘నా గొడవ’గా దానిలో ఏదన్న మంచి ఉన్నదంటే మంచిదేనని తన గొడవను చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాళోజీది కమ్యూనికేటివ్ కవిత్వం. తన గొడవ తెలంగాణ గొడవ. మౌలికంగా మనిషి గొడవ. ఏ కవి అయినా తన సమకాలీకుల మీద ఏ మాత్రం జంకు లేకుండా, నిర్భయంగా తన అభిప్రాయాన్ని వెలువరించటం తేలికైన పని కాదు. వ్యక్తుల మధ్య సంబంధాలు మరీ పలుచగా ఉంటున్న వర్తమాన స్థితిలో ఇది మరీ అసాధ్యం. ఈ విషయంలో కాళోజీ స్పష్టంగా ఉన్నారు. మొహమాటం కానీ, ఇతరులు ఏమనుకుంటారోనన్న భయం కానీ, ఆయన జీవితంలో, కవిత్వంలో ఎక్క డా మనకు కనిపించవు. ఇంకా చెప్పాలంటే కాళోజీ తీవ్ర ప్రజాస్వామిక వాది. కేవలం పౌర హక్కులకే కాదు, సమాజంలో ఏ దారుణం జరిగినా ఖండించటంలో ఆయన ముందుండేవారు.
‘దోపిడీ చేసే ప్రాంతేతరులను/
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వారే దోపిడీ చేస్తే/
ప్రాణంతోనే పాతర వేస్తం’
అని అగ్ర వర్ణ దళారుల అణచివేత, దోపిడీలను, వాళ్లతో మిలాఖతైన ప్రాంతం వారిని నిర్ద్వంద్వంగా ఖండించిన కాళోజీ ఆధునిక యుగంలో ఆదర్శప్రాయుడు. ఆయన 2002లో భౌతికంగా ఈ నేలను వీడినా ప్రతి తెలంగాణ వాడి గుండెలో బతికే ఉన్నారు. ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసిన ఆయన సమగ్ర మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఆకళింపు చేసుకొని ముందుకు నడవడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి. కాళోజీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ సాహిత్య కళాపీఠం చరిత్రలో నిలిచిపోయే మరెన్నో కార్యక్రమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటుంది.
(వ్యాసకర్త: భాషోపాధ్యాయురాలు, బొప్పాపూర్, సిద్దిపేట)
‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి చావులు ఒకచోట’
అంటూ బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి భూస్వామ్యవాదాన్ని తిరస్కరించిన ప్రజావాది. సాహిత్య ప్రవేశానికి ముందు కాళోజీ గొప్ప కథకుడు కావాలనో, కవిని అనిపించుకోవాలనో అనుకోలేదు. కాళోజీ కవిత కాలం ప్రవహిస్తున్న వ్యథ. ఇవ్వాళ నేను కవిత్వం చెప్పేది ‘నా గొడవ’గా దానిలో ఏదన్న మంచి ఉన్నదంటే మంచిదేనని తన గొడవను చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాళోజీది కమ్యూనికేటివ్ కవిత్వం. తన గొడవ తెలంగాణ గొడవ. మౌలికంగా మనిషి గొడవ.
దాసరి శాంతకుమారి
96524 83644