న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు దిగిరానున్నాయి. పండుగల సీజన్లో వినియోగదారులకు ఊరట కల్పిస్తూ కొన్ని రకాల ముడినూనెలపై బేసిక్ దిగుమతి సుంకాల్ని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఎత్తివేసి, సెస్ల్ని తగ్గించింది. రిఫైన్డ్ వంటనూనెలపై సుంకాల్లో కోతపెట్టింది. అలాగే ఈ నూనెలపై ఆగ్రి ఇన్ఫ్రా డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ)ను సైతం తగ్గించింది. దీంతో దేశంలో వంటనూనెల రిటైల్ ధర లీటరుకు రూ.15 వరకూ ఊరట లభించవచ్చని ఎడిబుల్ ఆయిల్ పారిశ్రామిక అసోసియేషన్ ఎస్ఈఏ తెలిపింది. రిఫైన్డ్ పామాయిల్ ధర రూ. 8-9 మేర, రిఫైన్డ్ సన్ఫ్లవర్, సోయాబీన్ నూనెల ధరలు 12-15 వరకూ దిగిరావొచ్చని అసోసియేషన్ ప్రతినిధి చెప్పారు. దిగుమతి సుంకాలు, సెస్ల తగ్గింపు ఈ అక్టోబర్ 14 నుంచి 2022 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది.