(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ) హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆహార ధాన్యాలకు కొరతే లేదంటారు.. తెల్లారే ఆహారోత్పత్తుల ఎగుమతులను నిషేధిస్తారు. రైతులు పండించిన పంట కొనాలని అడిగితే నాలుగేండ్లకు సరిపడా తిండిగింజలు గరిసెల్లో మూలుగుతున్నాయని చెప్తారు.. మిగులు ఉంటే మేం కొంటామని పరదేశాలు అడిగితే మాకే సరిపోవటంలేదని కూనిరాగాలు తీస్తారు.. రైతులను లక్షాధికారులను చేస్తామని రంగుల కల చూపిస్తారు.. మార్కెట్లను మూసేసి, సబ్సిడీలు ఎత్తేసి రైతులను రోడ్డున పడేస్తారు.. ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని పాలిస్తున్నామన్న స్పృహ, ముందుచూపు లేకుండా ప్రజల ఆహార భద్రతతో నరేంద్రమోదీ సర్కారు ప్రమాదకర ఆటలాడుతున్నది. దిక్కూ, దిశా లేని నిర్ణయాలతో రైతులను ఇప్పటికే అరిగోస పెడుతున్న కేంద్రం, తాజాగా సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో మొత్తం వ్యవసాయ రంగాన్నే సంక్షోభంలోకి నెట్టేలా అడుగులు వేస్తున్నది. ఎరువుల సబ్సిడీని తప్పించుకొనేందుకు పీఎం ప్రణామ్ పేరుతో సేంద్రియ సాగు ప్రోత్సాహక పథకాన్ని తెరపైకి తెచ్చింది.
ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియెంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ యోజనను సంక్షిప్తంగా ‘పీఎం ప్రణామ్’గా పిలుస్తున్నారు. వ్యవసాయరంగంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు ఈ పథకానికి కేంద్రం రూపకల్పన చేస్తున్నది. ఈ నెల ఏడో తేదీన నిర్వహించిన వచ్చే ‘వేసవికాల పంటలపై జాతీయ సదస్సు’లో ఈ పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. దీని విధివిధానాలు ఇంకా పూర్తిగా తెలియనప్పటికీ, ఎరువుల సబ్సిడీకి మంగళం పాడేందుకే ఈ పథకాన్ని తెస్తున్నారని ఇప్పటికే తెలిసిపోయింది.
‘సేంద్రియ సాగు దేశ స్వావలంబన లక్ష్యాన్ని మరింత దగ్గరకు చేరుస్తుంది. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులందరూ కృషి చేయాలి’.. అని ఆగస్టు 15న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆయన ప్రకటనకు కొనసాగింపుగానే కేంద్రం పీఎం ప్రణామ్ పథకాన్ని తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. సేవలు, పారిశ్రామికరంగాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయరంగమే ఆయువుపట్టు. దాదాపు 60 కోట్ల మందికిపైగా సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందునా భారతీయ రైతుల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరిపై ఎరువుల భారం పడకుండా చూసేందుకు దశాబ్దాల నుంచీ ప్రభుత్వాలు ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నాయి. కొన్నేండ్లుగా దేశంలో సాగుభూమి విస్తీర్ణం పెరగటంతోపాటు, వాణిజ్య పంటల సాగు కూడా పెరగటంతో రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగింది. ఇది ఏటా పెరుగుతూనే ఉన్నది. దానితోపాటే ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ కూడా పెరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరం ఎరువుల సబ్సిడీకి రూ. 1.62 లక్షల కోట్లను కేటాయిస్తే, 2022-23లో అది రూ. 2.25 లక్షల కోట్లకు చేరనున్నట్టు అంచనా. ఈ సబ్సిడీ లేకపోతే కోట్లమంది రైతులు సాగునుంచి దూరమయ్యే ప్రమాదం ఉన్నది. కానీ, బీజేపీ సర్కారు ఆ విషయాన్ని వదిలేసి ఎరువుల సబ్సిడీ భారాన్ని వదిలించుకోవటం గురించే ఆలోచిస్తున్నది.
సేంద్రియ సాగు ఒక్కరోజులో ఆచరించేది కాదు. చాలాకాలం క్రితమే మనదేశంలో ప్రకృతి సేద్యం వంటి సేంద్రియ సాగు పద్ధతులు అమలుచేసి చూశారు. కానీ, భారీగా ఉన్న మనదేశ జనాభాకు సరిపడా ఆహారధాన్యాలు పండించాలంటే సేంద్రియ పద్ధతులు సరిపోవు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించాలంటే రసాయనిక ఎరువులు వాడాల్సిందే. సేంద్రియ సాగు పేరుతో ఆటలాడితే పరిణామాలు ఎలా ఉంటాయో మన పక్కనే ఉన్న శ్రీలంకనే ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ ఒక్క నెలలో సేంద్రియ సాగుకు మారాలన్న ప్రభుత్వ నిర్ణయం మొత్తం దేశమే దివాలా తీసేలా చేసింది. ప్రపంచంలోని మొత్తం వ్యవసాయంలో 1.5 శాతం భూమిలో మాత్రమే సేంద్రియ సాగు కొనసాగుతున్నది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో ముందూ వెనుక ఆలోచించకుండా సేంద్రియ వ్యవసాయాన్ని తీసుకొస్తే.. ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నదని వ్యవసాయరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోట్ల ఎకరాల్లో సాగయ్యే వ్యవసాయాన్ని సమూలంగా మార్చేసేందుకు కేంద్రం అసలు నిధులే లేని పథకాన్ని తెస్తున్నది. పీఎం ప్రణామ్ పథకానికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులను కేటాయించబోరు. ఎరువులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలో కొంత మొత్తాన్ని ఈ స్కీమ్ కోసం పక్కన పెడతారు. అంటే పరోక్షంగా ఎరువుల సబ్సిడీలో కోత మొదలవుతుందన్నమాట. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ.. అంతకుముందు విడుదల చేసిన ఎరువుల సబ్సిడీ డబ్బులో మిగులు చూపించిన రాష్ర్టాలకు ప్రణామ్ నిధుల్లో 50 శాతం గ్రాంట్లుగా విడుదల చేస్తారు. అలా ఏటా ఎరువుల సబ్సిడీని తగ్గిస్తూ.. పీఎం ప్రణామ్కు మళ్లిస్తూ పోతారు.