లక్నో: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రాణాంతక వ్యాధి తమకు రావొద్దని, ఊరి ప్రజలంతా క్షేమంగా ఉండాలని అంతాకలిసి ఓ గుడి కట్టుకున్నారు. అందులో కరోనా మాతా అని పేరు పెట్టుకున్నారు. ప్రాణాంతక వ్యాధి బారినుంచి తమను రక్షించాలని రోజూ పూజలు చేస్తున్నారు. తమతోపాటు పక్కూరి ప్రజలకు కూడా ఎలాంటి ఆపదా రావద్దొని మొక్కకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా శుక్లాపూర్ గ్రామ ప్రజలు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ మాయదారి రోగం తమ దరి చేరనీయొద్దని అనుకున్న శుక్లాపూర్ గ్రామ ప్రజలు కరోనాకు ఆలయం కట్టారు. అందులో కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. కరోనా మాత విగ్రహానికి మాస్కు కూడా కట్టారు. తమకు ఎలాంటి ఆపదా రానియోద్దని ప్రతిరోజు వేడుకుంటున్నారు. అదేవిధంగా గ్రామస్తులంతా మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని తీర్మానించుకున్నారు.
తమ ఊర్లో ఇలాంటి ఆలయం ఇదే మొదటిది కాదని, గతంలో ప్రజలను మసూచి పట్టిపీడించినప్పుడు కూడా మసూచి దేవాలయం కట్టుకున్నామని ఆలయ పూజారి చెప్పారు. ఇప్పుడు కరోనా మాతను ప్రతిష్టించుకున్నామని, ఆ దేవత తమను రక్షిస్తుందని చెప్పారు.