రంగస్థల కళాకారుల కష్టాలు, వారి జీవన సంఘర్షణను ఇతివృత్తంగా తీసుకొని మరాఠీ భాషలో రూపొందించిన ‘నటసామ్రాట్’ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా ఈ చిత్రానికి అగ్ర హీరో చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. రచయిత లక్ష్మీభూపాల రాసిన వచన కవిత్వాన్ని చిరంజీవి తన వాయిస్ ఓవర్లో వినిపించారని సమాచారం. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ ట్విట్టర్ ద్వారా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ సహృదయానికి, ప్రేమకు కృతజ్ఞతలు అన్నయ్య.. ఈ సినిమాకు మీ గళం కొత్త వెలుగుల్ని తీసుకొచ్చింది’ అని కృష్ణవంశీ పేర్కొన్నారు.