China | న్యూఢిల్లీ, జనవరి 7: భూటాన్ రాజకుటుంబానికి చెందిన పూర్వీకుల ప్రాంతం లో చైనా అతిపెద్ద భూ ఆక్రమణకు పాల్పడుతున్నది. సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన బేయుల్ కెన్నాజోంగ్ నదీ లోయలో టౌన్షిప్ల నిర్మాణం చకచకా సాగిస్తున్నది. ఒక పక్క సరిహద్దు సమస్యలపై భూటాన్తో చర్చలు జరుపుతున్న క్రమంలో డ్రాగన్ దేశం ఈ భారీ దురాక్రమణను కొనసాగిస్తున్నది. నెల రోజుల క్రితం ఉపగ్రహం తీసిన చిత్రాలు వెలుగుచూడటంతో మరోసారి చైనా కుటిల బుద్ధి బయటపడింది.
2020 నవంబర్ 9న తీసిన చిత్రంలో అక్కడ ఎలాంటి కట్టడాల నిర్మాణం ప్రారంభం కాలేదు. కానీ గత ఏడాది డిసెంబర్ 21న తీసిన చిత్రాలలో అక్కడో టౌన్షిప్ దర్శనమిస్తున్నది. ఒక పక్క భూటాన్ సరిహద్దుకు సంబంధించి చర్చలు జరుపుతుండగానే జాకర్లంగ్ రీజియన్ ప్రాంతంలో బీజింగ్ టౌన్షిప్ నిర్మాణాలను కొనసాగించడం చూస్తే ఈ ప్రాంతం నుంచి వైదొలగే ఆలోచనే డ్రాగన్ దేశానికి లేదన్నది స్పష్టమవుతున్నది.