China : చైనా శాస్త్రవేత్తలు (China Scientists) సముద్రగర్భంలో ఓ భారీ ఖనిజ నిధిని కనుగొన్నారు. పశ్చిమ పసిఫిక్ (Pacific Ocean) మహాసముద్రంలో చేపట్టిన పరిశోధనల్లో అత్యంత విలువైన బంగారం (Gold), వెండి (Silver) నిక్షేపాలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. భూమిపై లభించే గనులతో పోలిస్తే ఇక్కడ బంగారం, వెండి నిల్వలు గణనీయంగా అధిక స్థాయిలో ఉండటం విశేషం. సింఘువా యూనివర్సిటీ (Singhuva university), షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ సహా పలు సంస్థల పరిశోధకులు ‘జియాంగ్ యాంగ్ హాంగ్ 10’ అనే నౌకలో ఈ యాత్రను చేపట్టారు.
సేకరించిన నమూనాలను నౌకలోని ల్యాబ్లోనే విశ్లేషించగా ఆశ్చర్యపరిచే ఫలితాలు వచ్చాయి. ఇక్కడి ఖనిజాల్లో ప్రతి టన్నుకు 15.4 గ్రాముల వరకు బంగారం, 1,271 గ్రాముల వరకు వెండి ఉన్నట్లు తేలింది. ఈ నిక్షేపాలు చైనా ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని సముద్ర భాగంలో ఉన్నాయి. సముద్ర అంతర్భాగంలో 700 నుంచి 1,500 మీటర్ల లోతులో ఈ హైడ్రోథర్మల్ క్షేత్రం ఉంది. ఇక్కడ సముద్రపు నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉన్నట్లు గుర్తించారు.
మూడు పెద్ద శంఖాకార నిర్మాణాలతో ఉన్న ఈ ఖనిజ క్షేత్రం భవిష్యత్తులో ప్రపంచస్థాయి సముద్రగర్భ నిక్షేపంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండితోపాటు రాగి, ఇనుము, జింక్ వంటి ఇతర కీలక ఖనిజాలు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఈ నిక్షేపాల పూర్తిస్థాయి పరిమాణం, ఆర్థిక ప్రయోజనాలను అంచనా వేయడానికి 2027లో మరింత కచ్చితత్వంతో కూడిన సర్వేలు చేపట్టాలని చైనా యోచిస్తోంది.
అయితే ఇంత లోతులో ఉన్న హైడ్రోథర్మల్ క్షేత్రాల నుంచి ఖనిజాలను వెలికితీయడం సాంకేతికంగా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రస్తుతం ఇలాంటి మైనింగ్ కార్యకలాపాలు ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదు.