శేరిలింగంపల్లి, నవంబర్ 24 : ఎన్నో ఏండ్లపాటు తాగు,సాగునీటినందించిన ప్రాచీన బావులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సాహి సొసైటీల సంయుక్తాధ్వర్యంలో చిరెక్ పబ్లిక్ స్కూల్ సౌజన్యంతో గచ్చిబౌలిలో అధునాతనంగా పునరుద్ధరించిన పురాతన మెట్ల బావిని బుధవారం ఆయన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్వింద్కుమార్ మాట్లాడుతూ గతంలో నగరంలో 150 చారిత్రక, పురాతన బావులు ఉండేవని.. వాటిలో చాలావరకు నేడు కనుమరుగయ్యాయని, మిగిలిన పురాతన బావులను సంరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు.
ఇప్పటికే మోండా మార్కెట్, మీరాలంమండి, లాల్బజార్ల వద్ద బావులను పునరుద్ధరించామని పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ సంఘాలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతకు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం బౌలి, బాగ్లకు పేరొందిందని, పురాతన బావులు చాలావరకు కనుమరుగు కాగా, మిగిలిన వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేష్ మాట్లాడుతూ నగరంలో తగ్గిపోతున్న భూగర్భజలాల పరిరక్షణకు ప్రభుత్వంతోపాటు మనందరం తోడ్పాటుగా ఉండాలని కోరారు. ఈ బావి నుంచే గచ్చిబౌలికి ఆ పేరు వచ్చిందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ వెస్ట్జోన్ కమిషనర్ ప్రియాంక ఆల, భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ పండిత్, చిరెక్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సంచిత, శేరిలింగంపల్లి ఉపకమిషనర్ వెంకన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.