ములుగు : జిల్లాలోని గోదావరి నది( Godavari River ) లో ఇసుక అక్రమ తవ్వకాలపై బీఆర్ఎస్ పార్టీ మరింత ఉధృతంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతోందని బీఆర్ఎస్ నాయకులు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ( Y. Satish Reddy )తెలిపారు. ఇసుక అక్రమాలపై ఆధారాలతో సహా కలెక్టర్కు, ఆర్డీవోకు ఫిర్యాదు చేసి వారం రోజులు అవుతున్నా, కనీసం ఉలుకు పలుకూ లేదని పేర్కొన్నారు.
సీతమ్మ సాగర్ డీ సిల్టింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఆధారాలన్నీ అందజేయగా అధికారులు చర్యలు తీసుకుంటారని భావించాం. ఇప్పటికే తవ్వి తీసిన ఇసుకను సీజ్ చేసి పనులు నిలివేస్తారని అనుకున్నాం. కానీ వారం రోజులు గడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రులు సీతక్క( Sitakka ) , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti ) కీలకంగా ఉన్నారు కాబట్టే అధికారులు చర్యలు తీసుకోవడం లేదేనేది స్పష్టమవుతోందని వెల్లడించారు.
తవ్వకాలు జరుగుతున్న చోటికి వెళితే మంత్రులు సీతక్క, పొంగులేటి ఇసుక అక్రమాల గుట్టు రట్టవుతుందనే అధికారులు అటువైపు వెళ్లడం లేదని విమర్శించారు. అక్రమంగా అనుమతులు ఇవ్వడమే కాకుండా, ఇప్పుడు ఫిర్యాదు చేసినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నందున ఖచ్చితంగా పెద్దల అక్రమార్జన ఉందని అనుమానం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగుంటుతాయని రైతులు నెత్తి నోరు మొత్తుకుంటున్నా అధికారులు చర్యలకు కదలడం లేదని ఆరోపించారు.
కాసుల కక్కుర్తితోనే ఇదంతా చేస్తున్నారు. మంత్రులకు అధికారులు సహకరిస్తున్నారో.. లేదా భయపడుతున్నారో తెలియదు కానీ.. ఆ పాపంలో వీళ్లు కూడా పాలు పంచుకుంటున్నారని దుయ్యబట్టారు. వెంటనే గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు ఆపకపోతే,మేం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఛలో గోదావరి(Chlo Godavari ) కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రహదారులను దిగ్బంధించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం. ఇప్పటికే తవ్వి గుట్టలుగా పోసిన ఇసుకను సీజ్ చేస్తాం. మంత్రుల అక్రమార్జనను, వారికి సహకరిస్తున్న అధికారుల తీరును ప్రజల ముందు పెడతామని అన్నారు.