న్యూఢిల్లీ : గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు కేటాయించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం ఈ ఇప్పటి వరకు రూ.25,129.98 కోట్లు విడుదల చేసింది.
తాజాగా కేటాయింపుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.2,162.4కోట్లు, మహారాష్ట్రకు రూ.1,292.1 కోట్లు, బీహార్కు రూ.1,112.7 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.883.2కోట్లు కేటాయించింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణకు రూ.409.5కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.518.7కోట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.628.5, ఏపీకి రూ.969.50 కోట్లు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ నిధుల్లో 60 శాతం పారిశుధ్యం, ఓడీఎఫ్, తాగునీటి సరఫరాకు.. మరో 40 శాతం నిధులు జీతాల చెల్లింపుతో పాటు పంచాయతీలు అభీష్టం మేరకు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నది.