న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. శనివారం జరిగిన మహిళల 81కిలోల సెమీఫైనల్లో నందిని 0-5 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్ లజ్జాత్ కున్గెబయెవా(కజకిస్థాన్) చేతిలో ఓడి కాంస్య పతకం దక్కించుకుంది. ప్రత్యర్థి దూకుడుకు దీటుగా స్పందించలేకపోయిన నందిని ఓటమి వైపు నిలిచింది. ఇదే అదనుగా రెచ్చిపోయిన కజకిస్థాన్ బాక్సర్ పవర్ఫుల్ పంచ్లతో విరుచుకుపడి అలవోక విజయాన్ని ఖాతా లో వేసుకుంది. మరోవైపు ఆదివారం జరిగే ఫైనల్ బౌట్లలో నిఖత్ జరీన్(52కి)..టెటియానా కోబ్(ఉక్రెయిన్)తో తలపడనుండగా, నీతు(48కి)..ఎరికా ప్రిస్కియాండ్రో(ఇటలీ)తో పోరుకు సిద్ధమైంది. 2019లో పసిడి పతకంతో మెరిసిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ మరోమారు అదే స్థాయి ప్రదర్శన కనబరుచాలని చూస్తున్నది. టోర్నీలో ఓవైపు మహిళలు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంటే.. భారత పురుష బాక్సర్లు ఘోరంగా నిరాశపరిచారు.