మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు సాగు చేసేందుకు రాయితీలు ఇవ్వడంతో అన్నివర్గాల రైతులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అన్ని కాలాల్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడం కూడా రైతులకు కలిసివస్తున్నది. రవాణా వ్యవస్థ మెరుగుపడడం, అన్ని సమయాల్లో కూరగాయలకు ధరలు ఉండడంతో కూరగాయ పంటల సాగుపై రైతులు ఆసక్తి
చూపుతున్నారు.
తాడ్వాయి, నవంబర్ 26
వ్యవసాయంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకుంటున్నారు. కొన్నేండ్లుగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులూ ఇదే నిజమని చెబుతున్నారు. ఎకరం భూమిలో పది రకాల కూరగాయల పంటలను సాగు చేస్తే వరికి వచ్చిన డబ్బులకన్నా రెండింతలు సంపాదించవచ్చని రైతులు తెలిపారు. వానకాలం, యాసంగిలో రైతులు తమ భూమిలో కొంత భాగం కూరగాయలు సాగు చేయాలని వివరిస్తున్నారు. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలను సాగు చేయడం మేలంటున్నారు. పంట మార్పిడితోపాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయడానికి రైతులు దృష్టి పెట్టితే నష్టపోకుండా ఉండొచ్చంటున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి, బ్రాహ్మణపల్లి, కృష్ణాజివాడి, తాడ్వాయి, ఎండ్రియాల్, ఎర్రాపహాడ్ గ్రామాల రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాలు జిల్లా కేంద్రానికి 3నుంచి 5కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా కొందరు రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. వీరితోపాటు మరికొంత మంది రైతులకు అవగాహన కల్పిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశమున్నది. గ్రామాల్లో కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం సైతం ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. రాయితీపై కూరగాయల నారు, బిందు, తుంపర సేద్యం పరికరాలను అందిస్తున్నది. ఉద్యానవనశాఖ అధికారులు సైతం సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు రైతులకు సబ్సిడీపై విత్తనాలను ఇస్తున్నారు.
25ఏండ్లుగా సాగు చేస్తున్న..
వ్యవసాయబావి వద్ద నాకు ఉన్న భూమిలో 25 ఏండ్లుగా 70శాతం కూరగాయలు సాగు చేస్తున్న. ప్రతిరోజూ కామారెడ్డికి కూరగాయలు తీసుకొని వెళ్లి అమ్ముతాను. నీటి పారకం, ఖర్చు తక్కువ ఉంటుంది. సీజన్ను చూసి కూరగాయలు సాగు చేస్తే నష్టం రాదు.
రెండింతలు సంపాదించవచ్చు
కూరగాయలు సాగు చేసే వారు ఓపికతో కష్టపడి పని చేస్తే పెట్టిన పెట్టుబడికి రెండింతలు సంపాదించవచ్చు. బావి, బోరు ఉంటేనే కూరగాయలు సాగు చేయొచ్చని కొందరు భయపడుతున్నారు. అర ఎకరం భూమిలో ఏడాదిలో 3 రకాల కూరగాయలు సాగు చేస్తాం. -లక్ష్మి, దేవాయిపల్లి
ఏడాదికి రెండు లక్షలు సంపాదిస్తున్న
కూరగాయల సాగులో ఖర్చు లు పోగా ఏడాదికి రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నా. నాకున్న మూడెకరాల భూమి లో ఏడాది పాటు కూరగాయ లు సాగు చేశాను. సీజన్ మేరకు టమాట, వంకాయ, మిరప, పాలకూర, బెండ కాయ, కొత్తిమీర, తోటకూర వంటి ప్రధాన కూరగాయలను సాగు చేస్తా. రైతులు కష్టం అనుకోకుండా కూరగాయలు సాగుచేస్తే లాభాలు ఉంటాయి.