సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్లోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో శ్రీ భూలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠాపన, కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగాయి. సోమవారం మంత్రోచ్ఛరణల నడుమ వేదపండితులు మహా పూర్ణాహుతి, మూర్తిబింబ స్థాపన, ప్రథమ ఆరాధన, అర్చన, మహాకుంభ ప్రోక్షణ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ మాట్లాడుతూ ఈ వేడుకలను వేద, ఆగమ శాస్ర్తాల ప్రకారం నిర్వహించామని.. శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, శ్రీరాధాగోవిందుడి కృపతో ప్రతిఒక్కరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.