హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2, 3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచితంగా ఆఫ్లైన్ కోచింగ్ ప్రారంభించనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కే అలోక్ కుమార్ మంగళవారం ప్రకటించారు. గ్రూప్-2, 3, 4 శిక్షణకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు.
డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ప్రథమ శ్రేణిలో బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించకూడదని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నకళ్లతో నేరుగా బీసీ స్టడీ సర్కిల్, ఓయూ సెంటర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్, మాణికేశ్వర్నగర్, హైదరాబాద్ అడ్రస్కు రావాలని, పూర్తి వివరాలకు 040-24071178, 040-27077929 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.