కూకట్పల్లి, డిసెంబర్13: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న పరికరాలతో ఆజాదీకా అమృత మహోత్సవ్ ఎగ్జిబిషన్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ జె. సర్కాటే, కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానం ద్వారా మాట్లాడుతూ.. రక్షణశాఖ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశ రక్షణలో హెచ్ఏఎల్ పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. అనంతరం హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ జె.సర్కాటే మాట్లాడుతూ.. వర్చువల్ ద్వారా కేంద్ర మంత్రి ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి మాట్లాడుతూ..దేశ రక్షణ రంగానికి బాలానగర్లోని హెచ్ఏఎల్ పరిశ్రమ విడిభాగాలకు రూపకల్పన చేయడం గర్వంగా ఉందని, పరికరాల పట్ల ప్రజలకు అవగాహన కలిగేలా హెచ్ఏఎల్ అధికారులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డా. సునీల్ (ఎస్ఎల్డీ డివిజన్), చీఫ్ డిజైనర్ ఆర్ఎస్. ప్రసాద్, హెచ్ఏఎల్ అధికారులు, కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.