ఏపీలో రాజ్యసభ అభ్యర్థులను అధికార వైసీపీ ఖరారు చేసింది. నలుగురి పేర్లను ఖరారు ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు. విజయసాయి రెడ్డి, ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
ఇప్పటికే రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డికి సీఎం జగన్ మరోసారి ఛాన్స్ ఇచ్చినట్లైంది. ఇక బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు అనూహ్యంగా ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆర్. కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు పంపనున్నారు.
బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నదే తమ పార్టీ అభిమతమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నేపథ్యంలోనే బలహీన వర్గాలను రాజ్యసభకు పంపుతున్నామని తెలిపారు. గత రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ బలహీన వర్గాలకు చెందిన పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ గారిని పంపామని గుర్తు చేశారు. రాజ్యసభ ఎన్నికలనేవి దేశం మొత్తానికి సంబంధించిన ఎన్నికలని, తెలంగాణ, ఆంధ్రా అంటూ వుండవని అన్నారు. బీసీల తరపున ఆర్. కృష్ణయ్య జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.