డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
పెద్దపల్లి రూరల్ : జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద గురువారం సాయంత్రం జరిగింది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో అందులో ప్రయాణిస్తున్న వారికి, గ్రామస్తులకు పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.