భోపాల్: హెలికాప్టర్ కొనేందుకు ఒక మహిళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహాయం కోరింది. ఈ మేరకు ఆమె రూపొందించిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని అగర్ గ్రామానికి చెందిన బసంతి బాయి లోహర్కు కొంత వ్యవసాయ భూమి ఉన్నది. అయితే గ్రామానికి చెందిన రైతు పర్మానంద్ పటిదార్, ఆయన ఇద్దరు కుమారులు లవ్, కుష్ ఆమె పొలానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. దీనిపై స్థానిక అధికారులకు ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో ఆవేదనకు గురైన బసంతి బాయి దీని గురించి ఏకంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసింది. రైతు పర్మానంద్ పటిదార్, ఆయన ఇద్దరు కుమారులు తన పొలానికి వెళ్లే దారిని మూసివేశారని అందులో ఆరోపించింది. వ్యవసాయంపైనే తాను ఆధారపడి జీవిస్తున్నానని, దీంతో తన పొలానికి వెళ్లే మార్గం లేదని వాపోయింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో పొలానికి వెళ్లి సాగు చేసుకుంటానని, దీనిని అధికారులు ఏర్పాటు చేయాలి లేదా కొనేందుకు రుణం, సంబంధిత లైసెన్స్ కోసం సహాయం చేయాలని రాష్ట్రపతిని ఆ లేఖలో కోరారు. బసంతి ఆవేదనను ఒక వ్యక్తి హిందీలో ఈ మేరకు టైప్ చేశారు.
మరోవైపు ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే యశ్పాల్ సింగ్ స్పందించారు. ఆ మహిళకు తాను సహాయం చేస్తానని చెప్పారు. అయితే హెలికాప్టర్ ఏర్పాటు కాదని, ఆమె తన పొలానికి వెళ్లేలా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.