చరిత్ర మరచిన.. చరిత
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం కోట్ల నరసింహులపల్లి. ఈ సాధారణ పల్లె, బృహత్ శిలాయుగంలో ఓ వెలుగు వెలిగింది. రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులతోపాటు కాకతీయుల ఆనవాళ్లను తన గుండెల్లో దాచుకుంది.హిందూ, జైన మత ప్రాభవాలతో విలసిల్లింది.
కోట్ల నరసింహులపల్లి చరిత్ర ఈనాటిది కాదు. వేల సంవత్సరాలకు పూర్వం.. ఆదిమ మానవులు ఉపయోగించిన రాతి పనిముట్లు ఈ గ్రామంలోని బీరప్ప గుడిలో పూజలందుకొంటున్నాయి. పల్లె సమీపంలోని నందగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో శిలాయుగపు సమాధులు, రాతి గొడ్డళ్లు నూరుకునే గుంతలు, పురాతన రాతి చిత్రాలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికీ, గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్దకొండపై రాతితో నిర్మించిన కోటగోడ కనిపిస్తున్నది. గుట్ట కిందిభాగంలో గ్రామం చుట్టూ మట్టికోటను నిర్మించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ గ్రామ పరిసరాలు 3500 ఏండ్లకు పూర్వమే ప్రాచీన మానవుడి ఆవాసాలుగా ఉన్నాయనడానికి ఇక్కడ లభించిన పురావస్తు ఆధారాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చారిత్రక నేపథ్యం..
శాతవాహన వంశ మూలపురుషుడు శ్రీముఖుని కొడుకు శాతకర్ణి (క్రీ.పూ.241) ప్రతిష్ఠానపురం (పైఠాన్) నుంచి జైత్రయాత్రగా వెళ్తున్నప్పుడు నందగిరి మీద కొంతకాలం విశ్రాంతి తీసుకొన్నాడనీ, ఇక్కడి వాతావరణం నచ్చి కొండపైనే ఒక మందిరాన్ని నిర్మింపజేశాడని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న కోట శిథిలాలన్నీ నాటివేనని అంటున్నారు. వారి కథనానికి బలం చేకూర్చేలా ఇక్కడ శాతవాహనుల కాలంనాటి డిజైన్లు ఉన్న కుండ పెంకులు, ఇటుక ముక్కలు లభించడం విశేషం. అంతేకాకుండా, కోట్ల నరసింహుల పల్లిలో రెండు (రాతి, మట్టి) కోటలున్నాయి. మధ్యయుగాల నాటి నరసింహస్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది. అందువల్లే ఈ గ్రామానికి కోటల నరసింహులపల్లి అనే పేరు వచ్చింది. క్రమంగా కోట్ల నరసింహులపల్లిగా స్థిరపడిందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఉగ్ర నారసింహ విగ్రహం
కోట్ల నరసింహులపల్లిని ఆనుకుని ఉన్న దేవునిగుట్టపై ఉన్న పెద్దరాతి మీద షోడశబాహు అష్టముఖ ఉగ్ర నారసింహస్వామి విగ్రహం చెక్కి ఉన్నది. ఇలాంటి అష్ట(8)ముఖ, షోడశ(16) బాహు నరసింహమూర్తి శిల్పాలు దేశంలోనే అరుదు. ఈ అర్ధ (ఉల్బణ)శిల్పం ప్రాచీనమైంది కూడా. శిల్ప శైలిని బట్టి రాష్ట్రకూటుల కాలానికి చెందినదిగా పురావస్తు నిపుణులు గుర్తించారు. విగ్రహం పాక్షికంగా ధ్వంసమై కనిపిస్తున్నది. కుడివైపున రెండు చేతులు హిరణ్యకశపుడి పొట్టను చీలుస్తున్నట్లుగా ఉన్నది. మిగతా చేతుల్లో ఆయుధాలు దర్శనమిస్తున్నాయి. ఇదే గుట్టపై ప్రసన్న లక్ష్మీనరసింహ స్వామి, సీతారామ చంద్రస్వామి దేవాలయాలు ఉన్నాయి. పక్కనున్న మరోగుట్టపై శివాలయం, కోనేరు దర్శనమిస్తాయి.
జైన విగ్రహాలు..
గ్రామంలోని బీరప్ప గుడి సమీపంలో వ్యవసాయ పనుల్లో భాగంగా భూమిని దున్నేటప్పుడు పలుమార్లు జైన తీర్థంకరుల విగ్రహాలు బయటపడ్డాయి. 2017లో బయల్పడిన శిల్పం జైనంలో 19వ తీర్థంకరుడైన మల్లినాథ తీర్థంకరుడిది. నల్లని గ్రానెట్తో పద్మాసన భంగిమలో సుందరంగా చెక్కిన విగ్రహం ఇది. దీని ఎత్తు 90 సెంటీమీటర్లు, వెడల్పు 76 సెంటీ మీటర్లు ఉన్నది. 2020లో బయల్పడిన మరో శిల్పం 23వ జైన తీర్ధంకరుడైన పార్శ్వనాథుడిది. నల్లటి బసాల్ట్ రాతితో కళ్యాణీ చాళుక్యుల శిల్పశైలిలో ఏడు పడగలతో చెక్కిన శిల్పమిది. మూడు అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని చెక్కారు. పార్శ్వనాథుని పాదాలవద్ద ఇరువైపులా యక్ష, యక్షిణులిద్దరూ కనిపిస్తున్నారు. ఈ అపురూప సంపదను మనం రక్షించుకోవాలి.
అరవింద్ ఆర్య 997 270 270