వనస్థలిపురం, డిసెంబర్ 24 : వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ర్టాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి వరుసలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ప్రత్యేక వార్డు, 12 పడకల ఐసీయూ వార్డు, ఆక్సిజన్ ప్లాంటును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కరోనా మూడవ దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు దవాఖానలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఏరియా దవాఖానలో 120 పడకలుండగా, మరో వంద పడకలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
ఇన్ఫోసిస్ సంస్థ సహకారంతో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలోని వివిధ దవాఖానల్లో 1400 పడకలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యాక్షన్ప్లాన్లో భాగంగా మల్కాజిగిరి, కొండాపూర్, మలక్పేట గోల్కొండ, గాంధీ దవాఖానల్లో ఇప్పటికే 792 పడకలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డి, పద్మానాయక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, చింతల రవికుమార్, అనిల్ చౌదరి, టీఆర్ఎస్ యూత్ జిల్లా ఇన్చార్జి మాధవరం నర్సింహారావు, వజీర్ ప్రకాశ్గౌడ్ పాల్గొన్నారు.
ఆక్సిజన్, మందుల కొరత లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ఆక్సిజన్ రవాణా కోసం 540 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 27 కంటైనర్లను సిద్ధం చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి రోజుకు 135 మెట్రిక్ టన్నుల నుంచి 327 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామన్నారు. 21లక్షల హోమ్ ఐసొలేషన్ కిట్లు, 10లక్షల పీపీఈ కిట్లు, 40లక్షల ఎన్95 మాస్కులు ఇతర సామగ్రిని సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని సూచించారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దవాఖానలో లిఫ్టు, ఎక్సరే మిషన్, బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. 15 రోజుల్లోనే మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
సేవలెలా ఉన్నాయ్..: మంత్రి హరీశ్రావు
వనస్థలిపురం ఏరియా దవాఖానలో నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి హరీశ్రావు శుక్రవారం సందర్శించారు. కేంద్రంలో ఉన్న డయాలసిస్ బాధితులతో మాట్లాడారు. సిబ్బంది, కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎంతో కష్టంగా ఉన్న డయాలసిస్ ప్రక్రియను సీఎం కేసీఆర్ చొరవతో సులభం చేశామని దీంతో వేలాది మంది బాధిత కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందన్నారు. వనస్థలిపురంలో 50మందికి నిత్యం సేవలందిస్తున్నట్లు సిబ్బంది మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రియ, ఆర్ఎంవో రాజ్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ శ్రీభూషన్ రాజు, శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.