టీఆర్ఎస్ 2004 ఎన్నికల తరువాత కేంద్ర మంత్రివర్గంలో చేరింది. యూపీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ఫలానా శాఖ కావాలంటూ ఒత్తిడులు తెస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఏ శాఖ లేకున్నా ఫరవాలేదు, నాకు తెలంగాణ ఇస్తే చాలన్నారు. ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో ఈ విషయం రాశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా చేరిన తరువాత, వివిధ పార్టీలను సంప్రదించి ఆమోదం సాధించారు. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో తెలంగాణ అంశాన్ని పెట్టించగలిగారు. అయితే ఇదంతా ఆషామాషీగా జరగలేదు. ఆంధ్ర లాబీ తెరవెనుక కుట్రలు చేస్తూనే ఉన్నది. కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ ఏవైనా అక్రమాలకు పాల్పడతారేమోనని డేగ కండ్లతో చూస్తున్నది. ఇక్కడ కేంద్రంలోని ఈ ఆంధ్రా అనుకూల లాబీ కూడా కేసీఆర్పై కన్నేసి ఉంచింది. ఏయే ఫైల్స్ చూస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనేది కనిపెడుతున్నది. అయినా వారికి నిరాశే మిగిలింది. కేసీఆర్ వ్యూహం ప్రకారం తరచూ ఎన్నికలు జరిగేవి. టీఆర్ఎస్కు నిధులు లేక చాలా ఇబ్బందిగా ఉండేది. తెలంగాణలో కేసీఆర్ ఏకైక పవర్ సెంటర్.. అధికారం ఉన్నా లేకున్నా శక్తిమంతుడే. డబ్బు కావలిస్తే ఎంతయినా వచ్చేది. కానీ కేసీఆర్ ఒప్పుకోకపోయేవారు. మన ఆశయం పవిత్రమైనది. దానిని సాధించాలంటే మనం కూడా పవిత్రంగానే ఉండాలి అనేవారు.
టీఆర్ఎస్ పార్టీ పిడికెడు మందితో ప్రారంభమై నేడు 75 లక్షల సభ్యత్వాలతో ముందుకు సాగుతున్నది. భారతదేశంలో ఒక మంచి రాజకీయ పార్టీగా తయారైంది. మనమందరం ప్రజల మధ్య ఉండి అభివృద్ధి పనులను చేసి ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలె.