కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో లీగ్లో పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్లు, కామెంటేటర్లు మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో ఉన్న 38 మంది ఆసీస్ ఆటగాళ్ల బృందం సోమవారం స్వదేశానికి చేరుకోనుంది. ఐపీఎల్ 2021 సందర్భంగా పలువురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలడంతో మే4వ తేదీన లీగ్ను వాయిదా వేశారు.
భారత్ నుంచి విమాన ప్రయాణికులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆసీస్ బృందం మాల్దీవులకు వెళ్లింది. ఇటీవల విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేయడంతో వీరంతా స్వదేశానికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. కరోనా నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ కూడా సోమవారం భారత్ నుంచి ఆస్ట్రేలియా చేరుకోనున్నట్లు తెలిసింది.