ముంబై: ఇంద్రాణి ముఖర్జీ కుమార్తె షీనా బోరాను కలిసిన మహిళ స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని ఆమె తరుఫు న్యాయవాది సనా ఆర్ ఖాన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ 24న శ్రీనగర్లోని దాల్ సరస్సు సమీపంలో షీనా బోరాను కలిశానని ఒక మహిళా అధికారిణి చెప్పినట్లుగా తన క్లయింట్ ఇంద్రాణి ముఖర్జీ ద్వారా తెలిసిందన్నారు. కుమార్తె షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జీ హత్య చేసినట్లుగా నమోదైన కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐకి వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని న్యాయవాది తెలిపారు. ఈ నేపథ్యంలో షీనా బోరా హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేస్తామని మీడియాతో అన్నారు.