పేపర్లో చికెన్ ఇవ్వలేదంటూ తాలిబ్ కొడుకు ఆవేదన
అనవసరంగా కేసు పెట్టి అరెస్టు చేశారని కన్నీటిపర్యంతం
భయంభయంగా గడుపుతున్న తాలిబ్ కుటుంబసభ్యులు
సంభల్, జూలై 8: అది ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లా చమన్ సరాయ్. అక్కడ 45 ఏండ్లుగా నడుస్తున్నది మెహెక్ హోటల్. రోజూ వందల మంది వచ్చి ఆహారం తీసుకెళ్తుంటారు. ఆ హోటల్ యజమాని పేరు తాలిబ్ హుస్సేన్. వయసు 58 ఏండ్లు. మొన్నటి వరకు ఆ కుటుంబం అందరితో కలసి మెలసి ఉండేది. ఒక్క రాత్రిలోనే వారి జీవితం మారిపోయింది. బయటకు కూడా అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. కళకళలాడే ఆ హోటల్కు ఇప్పుడెవ్వరూ రావట్లేదు. ఆయన మనుమలు, మనుమరాళ్లు బడికి కూడా వెళ్లలేకపోతున్నారు. భయంతో కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఇంతకీ ఆ కుటుంబం చేసిన నేరమేంటి..? హిందూ దేవతల ఫొటోలున్న పేపర్లో చికెన్ అమ్మాడని ఆ ఇంటి పెద్ద తాలిబ్ హుస్సేన్పై ఫిర్యాదు అందింది. అంతే పోలీసులు రంగంలోకి దిగి రాత్రికి రాత్రి ఆయన్ని అరెస్టు చేశారు. కుటుంబం మొత్తం నిద్రాహారాలు మాని రోదిస్తున్నది.
బెయిల్ కష్టమే..
హుస్సేన్ తరఫు న్యాయవాది ఇఖద్దర్ హుస్సేన్ పాషా బుధవారం బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. తమపై తాలిబ్ హుస్సేన్ దాడి చేశాడన్న పోలీసుల వ్యాఖ్యలపై న్యాయవాది స్పందిస్తూ..‘అంతమంది జనం ఉండగా పోలీసులపై ఎలా దాడి చేస్తాడు? అయినా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫుటేజీలు చూస్తే నిజం బయటపడుతుంది. వాళ్లు చెప్పేది అబద్ధమని తేలిపోతుంది. పైగా తాలిబ్ దాడి చేశారనే దానికి ఎలాంటి ఆధారాలను పోలీసులు చూపలేదు’అని పేర్కొన్నారు. అయితే తాలిబ్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఐపీసీలోని తీవ్రమైన సెక్షన్లు పెట్టారు. దీంతో బెయిల్ రావడం కష్టమేనంటున్నారు న్యాయరంగ నిపుణులు.
ఆయనకు మధుమేహం.. ఏమవుతుందో?
అసలు పేపర్లో చికెన్ పెట్టి ఇవ్వలేదని, అందులో రోటీలు పెట్టిచ్చామని తాలిబ్ కొడుకు తాబీష్ తెలిపాడు. చికెన్ కూరను వేరే ప్యాక్ చేసి ఇస్తామని చెప్పాడు. ఆదివారం రాత్రి 9 గంటలకు పోలీసులు తన తండ్రిని తీసుకెళ్లారని పేర్కొన్నాడు. చేయని తప్పునకు అరెస్టు చేశారంటూ వాపోయాడు. హిందూ సంస్థలతో పోలీసులు చేతులు కలిపి పథకం ప్రకారం ఇలా చేశారని ఆరోపించాడు. ‘ఇలాంటిది ఒకటి మాకు జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆయనకు మధుమేహం ఉన్నది. కాలుకు గాయం కూడా ఉంది. చాలా భయంగా ఉంది’ అని తాలిబ్ భార్య నైమా బేగం రోదిస్తూ తెలిపారు.