చెన్నై: బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు గవర్నర్లు సృష్టిస్తున్న అడ్డంకులపై ఆయా రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజలు ఎన్నుకోని వారు అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ తమిళనాడు గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర మంత్రి మండిపడ్డారు. గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం బుధవారం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పీ త్యాగరాజన్ గురువారం మీడియాతో మాట్లాడారు. బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గవర్నర్ల నుంచి అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గవర్నర్లను ఎన్నికకాని వ్యక్తులుగా పేర్కొన్న ఆయన వారి అనైతిక ప్రవర్తనను ప్రశ్నించారు.
మన దేశ స్థాపకులు లేదా రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో ఎక్కడా కూడా గవర్నర్లకు తగిన స్థానం లేదని మంత్రి త్యాగరాజన్ అన్నారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రతినిధులు అసెంబ్లీలో ఆమోదించిన వాటిపై, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక ఎన్నికకాని వ్యక్తి (గవర్నర్) వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం సరికాదని విమర్శించారు.
కాగా, గవర్నర్ పాత్ర చాలా గౌరవంతో కూడినదని మంత్రి త్యాగరాజన్ అన్నారు. గవర్నర్ పీఠంపై కూర్చున్న వ్యక్తులు రాజ్యాంగానికి అతీతులు కాదని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న సమాజాన్ని ఎలా నడపాలో అన్నదానిపై వారి స్వంత అభిప్రాయంతో కూడిన దృక్కోణాలను సమర్థించడం చాలా అసభ్యకరమని అన్నారు. ఇలాంటివి వీధి స్థాయి రాజకీయ నాయకులు చేసేవని, గవర్నర్ సీటులో కూర్చొన్న వ్యక్తి చేసే పనులు కాదంటూ మండిపడ్డారు.