భోపాల్: ఓవైపు దేశమంతా కరోనా వ్యాక్సిన్ కొరతతో అల్లాడిపోతుంటే.. మరోవైపు లక్షల కొద్దీ డోసుల వ్యాక్సిన్ను అలా రోడ్డు పక్కన వదిలేసి వెళ్లడం గమనార్హం. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలోని కరేలీ బస్టాండ్ దగ్గర సుమారు 2.4 లక్షల కొవాగ్జిన్ డోసులు ఉన్న ట్రక్ను ఎవరో వదిలేసి వెళ్లారు. ఆ ట్రక్ చాలా సేపటి నుంచి అక్కడే ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కరేలీ పోలీసులు వచ్చి చూడగా.. అందులో కరోనా వ్యాక్సిన్ను గుర్తించారు.
అందులో డ్రైవర్, క్లీనర్ ఎవరూ లేరు. ఈ వ్యాక్సిన్ల మొత్తం ఖరీదు రూ. 8 కోట్ల వరకూ ఉంటుందని కరేసీ ఎస్ఐ ఆశిష్ బొపాచె వెల్లడించారు. డ్రైవర్ ఫోన్ నంబర్ తెలుసుకొని ట్రేస్ చేయగా.. అతని ఫోన్ రోడ్డు పక్కన పొదల్లో దొరికినట్లు ఆయన చెప్పారు. ట్రక్లో ఏసీ పని చేస్తోందని, దానిని బట్టి వ్యాక్సిన్లన్నీ బాగానే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. డ్రైవర్, క్లీనర్ కోసం తాము ఇంకా వెతుకున్నట్లు చెప్పారు.