తిరువనంతపురం: ఒక రైలు స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోయింది (Train misses station halt) . దీంతో ఆ స్టేషన్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు.అయితే పొరపాటును గ్రహించిన లోకో పైలట్ సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ రైలును వెనక్కి నడిపాడు. దీంతో ఆ స్టేషన్కు రైలు చేరడంతో ప్రయాణికులు అందులోకి ఎక్కారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షోరనూర్కు వెళ్లే వేనాడ్ ఎక్స్ప్రెస్ రైలు సోమవారం ఉదయం 7.45 గంటలకు చెరియనాడ్ అనే చిన్న రైల్వే స్టేషన్లో ఆగాల్సి ఉంది. అయితే లోకో పైలట్ రైలును ఆ స్టేషన్లో నిలుపలేదు. సుమారు 700 మీటర్ల దూరం వెళ్లిన తర్వాత జరిగిన పొరపాటును లోకో పైలట్ గుర్తించాడు. ఆ రైలును రివర్స్లో నడిపి స్టేషన్ వద్దకు చేర్చాడు. దీంతో ఆ రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు అందులోకి ఎక్కారు.
కాగా, చిన్న రైల్వే స్టేషన్ చెరియనాడ్కు స్టేషన్ మాస్టర్ లేడని, అలాగే ఎలాంటి సిగ్నల్ కూడా అక్కడ లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్లో రైలు ఆపడంలో లోకో పైలట్ పొరపడినట్లు చెప్పారు. అయితే దీనిని వెంటనే గ్రహించి రైలును వెనక్కి నడిపి స్టేషన్ వద్దకు చేర్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని తెలిపారు. అలాగే ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆ రైలు సకాలంలో గమ్యస్థానానికి చేరిందని రైల్వే అధికారులు చెప్పారు. అయినప్పటికీ ఆ స్టేషన్ వద్ద రైలును నిలుపని లోకో పైలట్ల నుంచి వివరణ కోరుతామని పేర్కొన్నారు.