Thrissur Accident | కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-66పై కైపమంగళం పనంబికున్ను వద్ద ఆగివున్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు కాగా.. మరో వ్యక్తి డ్రైవర్గా తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని మధురై రిజిస్ట్రేషన్ ఉన్న కారు గురువాయూర్ నుంచి కొడుంగల్లూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కైపమంగళం పనంబికున్ను వద్ద హైవేపై నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకున్న వారిని బయటకు తీయడం తీవ్రంగా కష్టమైంది. అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక పరికరాలతో కారును కోసి ఇద్దరిని బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. స్థానికులు, అగ్నిరక్షక సిబ్బంది, పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యల అనంతరం మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను త్రిశూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు.
మృతులను తమిళనాడులోని దిండిగల్లో ఉన్న పీఎస్ఎన్ఏ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. వారి కాలేజీ ఐడీ కార్డుల ఆధారంగా మృతులను సేలం జిల్లాకు చెందిన విశ్వ (20), దిండిగల్కు చెందిన సూర్య(20), మధురైకి చెందిన సంతోష్ (20), ప్రసన్న, దిండిగల్కు చెందిన యువసంజిత్(20)గా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే, ప్రమాదానికి హైవేపై లారీని ఆపిన తీరే కారణమై ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ బోర్డు కనిపించకుండా ఉండేలా నిర్లక్ష్యంగా ఆపారని అంటున్నారు. ప్రమాద ప్రాంతంలో మూడు లారీలను ఒకదాని వెనుక ఒకటిగా నిలిపారని పేర్కొంటున్నారు.