ముంబై : బీజేపీ పాలిత మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రభుత్వ మహిళా దవాఖాన నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (ఎన్ఐసీయూ) సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవజాత శిశువులు ముగ్గురు చనిపోగా.. 36 మంది శిశువులను రక్షించినట్టు అధికారులు తెలిపారు. పోలీస్ కమిషనర్ రాకేశ్ ఓలా తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఐసీయూలో శిశువుల కోసం మూడు విభాగాలుంటాయి.
దవాఖానలో పుట్టిన శిశువుల విభాగంలో తెల్లవారు జామున 3.15 గంటలకు ఓ వెంటిలేటర్లో మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి ముగ్గురు శిశువులు కాలి బూడిదయ్యారు. మిగిలిన వారిని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై శిశువుల తల్లిదండ్రులు దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోని ఫైర్ అలారం మోగలేదని, నీటి స్ప్రింక్లర్ వ్యవస్థ పనిచేయలేదని చెప్పారు.