హైదరాబాద్: ముస్లింలు తమ భార్యలకు త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చే విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితం చేసిన త్రిపుల్ తలాక్ చట్టంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) మరోసారి విమర్శలు చేశారు. ఆ చట్టం పూర్తిగా రాజ్యంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదని చెప్పారు. అయినా మోదీ సర్కారు ముస్లిం మహిళల హక్కుల కోసం మాత్రమే పనిచేస్తున్నదా..? కేవలం ముస్లిం మహిళా దినోత్సవమే జరుపుకుంటుందా..? అని ఓవైసీ ఎద్దేవా చేశారు. మరి హిందూ, దళిత, ఓబీసీ మహిళల సాధికారత సంగతి ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు.
వాస్తవానికి మోదీ సర్కారు చేసిన త్రిపుల్ తలాక్ చట్టం వల్ల ముస్లిం మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఈ చట్టం ముస్లిం మహిళలు మరింత దోపిడీకి పీడనకు గురయ్యేలా చేస్తుందని, వారి సమస్యలను మరింత పెంచుతుందని చెప్పారు. త్రిపుల్ తలాక్ చట్టంవల్ల కోర్టుల్లో కేసులు పెరిగిపోవడమే తప్ప ఎలాంటి న్యాయం జరుగదన్నారు. క్షేత్ర స్థాయిలో ముస్లింలు ఎవరూ ఆ చట్టాన్ని ఖాతరు చేయరని చెప్పారు.
అదేవిధంగా పార్లమెంట్లో పెగాసస్ స్పైవేర్పై చర్చించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తుండటంపై కూడా అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు. పెగాసస్పై చర్చంటే ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం దాచాలని చూస్తున్నదని మండిపడ్డారు. మేం సమావేశాలు సరిగా సాగాలని కోరుకుంటుంటే మీకు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారని ఆయన విమర్శించారు. మీరు కేవలం బిల్లులు పాస్ చేసుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యమేనా..? అని అసదుద్దీన్ ప్రశ్నించారు. కనీసం తమకు తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడంలేదని అసదుద్దీన్ మండిపడ్డారు