న్యూఢిల్లీ: మహిళల కనీస వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఎదిగిన ఆడపిల్లకు త్వరగా పెండ్లి చేయడానికే తల్లిదండ్రులు మొగ్గుచూపుతారని, అలా చేస్తే తప్పేంటని సమాజ్వాది పార్టీ సీనియర్ ఎంపీ షఫీకుర్ రహమాన్ బర్క్ ప్రశ్నించారు.
బాలికలు 18 ఏండ్లు రాగానే ఓటు వేయొచ్చుగానీ పెండ్లి చేసుకోగూడదా..? అని ఎస్పీకే చెందిన మరో ఎంపీ ఎస్టీ హసన్ ప్రశ్నించారు. బాలికలు 18 ఏండ్లకు ప్రధానిని ఎన్నుకోగలరుగానీ, జీవిత భాగస్వామిని ఎన్నుకోలేరా..? అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. మహిళల వివాహ వయసు పెంపుపై కొందరు చేస్తున్న కామెంట్లు విచిత్రంగా ఉన్నాయన్నారు.
21 ఏండ్లు వచ్చేవరకు పెండ్లి చేయకుండా ఆపితే ఆడపిల్లలు తిరుగుబోతులు అవుతారని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, వాళ్ల వ్యాఖ్యలు తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయని నఖ్వీ చెప్పారు. పెండ్లి ఆలస్యమైతే ఆడపిల్లలు తిరుగుబోతులు ఎందుకవుతారని ఆయన ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. వాళ్లది హిందుస్థానీ మనస్తత్వం కాదని, తాలిబనీ మనస్తత్వమని వ్యాఖ్యానించారు. అయితే, ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరు చేశారనేది మాత్రం మంత్రి వెల్లడించలేదు.