లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్లో ఏదో నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పార్టీ పగ్గాలు తేజస్వీ యాదవ్ చేతికి రాబోతున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి. అందుకు లాలూ రంగం కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు అదేమీ లేదు… లాలూ దగ్గరే పగ్గాలుంటాయని రబ్రీదేవితో సహా సాక్షాత్తూ లాలూయే ప్రకటించేస్తున్నారు. లాలూ మరో కొడుకు తేజ్ ప్రతాప్ కూడా పగ్గాలు తండ్రి దగ్గరే వుంటాయని అంటున్నారు. కొన్ని రోజులుగా ఆర్జేడీలో ఈ గొడవ సాగుతోంది. అయితే.. తేజస్వీ యాదవ్, సోదరుడు తేజ్ ప్రతాప్ మధ్య కోల్డ్వార్ సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోదరుడు తేజస్వీ యాదవ్ చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్లడం తేజ్ ప్రతాప్కు ఏమాత్రం గిట్టడం లేదని తెలుస్తోంది.
ఈ అంశం బలపడేట్లుగా గురువారం ఓ సంఘటన జరిగింది. దీనికి ఈ సంఘటన మరింత బలాన్నిస్తోంది. గురువారం రోజున పార్టీ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. తేజస్వీ యాదవ్ ఉపన్యాసం మొదలుపెట్టడమే ఆలస్యం.. ఆర్జేడీ నేత, తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. అమాంతం వేదికపై నుంచి దిగి వెళ్లిపోయారు. ఇలా తేజ్ప్రతాప్ హఠాత్తుగా వేదికపై నుంచి దిగిపోవడంతో ఆ సమావేశంలోని నేతలు ఒక్కసారిగా హతాశులయ్యారు. కొన్ని అంశాల విషయంలో సోదరులిద్దరి మధ్యా ఏమాత్రం పొసగడం లేదని, ఈ విభేదం ఇప్పుడు బట్టబయలైందని నేతలంటున్నారు. దీంతో పాటు పార్టీ పగ్గాల వార్తలు కూడా ఇప్పుడు వస్తున్నాయని, ఇది కూడా ఓ కారణమేనని అంటున్నారు.
ఎన్నికల సమయంలో వ్యవహారాలన్నీ తేజస్వీయే…
సరిగ్గా బిహార్ లో ఎన్నికలు.. లాలూకు ఆరోగ్యం బాగోలేదు.. జైళ్లో ఉన్నారు. ఎన్నికలేమో ముంచుకొస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో ఉండిపోయారు. ఆ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పార్టీ వ్యవహారాలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకున్నారు. పార్టీ టిక్కెట్ల పంపిణీ, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తులను బుజ్జగించడం, నితీశ్ను ఎదుర్కోవడం, బీజేపీపై విమర్శలు చేయడం.. ఒక్కటేమిటీ… అన్నీ ఒంటిచేత్తో నడిపించారు. ఆర్జేడీకి గౌరవప్రదమైన సీట్లను తెచ్చి పెట్టారు. ఇక అప్పటి నుంచి ఆర్జేడీలో తేజస్వీ శకం ప్రారంభమైపోయింది. లాలూ స్థానాన్ని తేజస్వీ భర్తీ చేస్తారని, ఆయనే సరైన వ్యక్తి అని పార్టీలో అందరూ భావించారు. అయితే ఈ వార్తలను అటు రబ్రీ దేవి, లాలూతో సహా.. తేజ్ప్రతాప్ కూడా కొట్టి పారేశారు. లాలూ దగ్గరే పార్టీ పగ్గాలుంటాయని తేల్చి చెప్పారు.
తేజ్ ప్రతాప్ భవితవ్యం ఏమిటో?
తేజస్వీ యాదవ్ చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళ్లిపోతే… మరి తేజ్ ప్రతాప్ భవితవ్యం ఏమిటన్న చర్చ కూడా ఆర్జేడీలో ప్రారంభమైపోయింది. ఆర్జేడీలో తేజ్ ప్రతాప్ బలం కూడా బాగానే వుంది. ఆయన మద్దతుదారులు కూడా ఎక్కువగానే వున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై ఆర్జేడీ ఇప్పటి వరకూ దృష్టి సారించలేదని తెలుస్తోంది. పార్టీలో రెండు పవర్ సెంటర్లు ఉంటే తలెత్తే ఇబ్బందులపై లాలూ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏమాత్రం పవర్ బ్యాలెన్స్ అసమానంగా ఉన్నా… పార్టీలో ఇబ్బందులు తథ్యమని సీనియర్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది.