Diabetes | న్యూఢిల్లీ: భారత్పై ‘షుగర్’ బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో 25 ఏండ్ల లోపువారికి కూడా డయాబెటిస్ వస్తున్నదని అనేక సర్వేల్లో తేలటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. డయాబెటిక్ రోగుల్లో పని సామర్థ్యం తగ్గిపోవటమే అందుకు కారణం. దేశంలో ఇప్పటికే డయాబెటిక్ రోగులు పది కోట్లు దాటారు. మరో మూడు నాలుగేండ్లలో వీరికి మరో 13 కోట్ల మంది జత కలుస్తారని ఐసీఎంఆర్ 12 ఏండ్లపాటు నిర్వహించిన పరిశోధనలో తేల్చింది. డయాబెటిక్ రోగులకు తోడు దేశంలో 30 కోట్లకుపైగా బ్లడ్ ప్రెషన్ (బీపీ) రోగులున్నారు. దీంతో దేశంలో పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నదని, ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మనదేశంలో 2022 నాటికి 10.01 కోట్ల డయబెటిస్ రోగులున్నారు. డయాబెటిస్పై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. దీంతో ఆ మహమ్మారి బారిన పడిన విషయం కూడా తెలియకుండా చాలామంది జీవితాలను కొనసాగిస్తున్నారు. వ్యాధి ముదిరి కండ్లు, గుండె, మూత్రపిండాలను దెబ్బతీసిన తర్వాతగానీ అసలు కారణం తెలుసుకోలేకపోతున్నారు. దీనివల్ల వైద్య ఖర్చుల భారం మరింత పెరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు.
డయాబెటిస్ వల్ల పౌరుల ఆరోగ్యంతోపాటు డబ్బుకూడా కరిగిపోతున్నది. ప్రపంచంలో డయాబెటిస్ రోగులు తమ వైద్యం, ఔషధాల కోసం చేస్తున్న వ్యయం విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. జర్నల్ ఆఫ్ హెల్త్ ఎకనామిక్స్ అండ్ ఔట్కమ్స్ రిసెర్చ్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం భారత్లో 2017లోనే డయాబెటిస్ వైద్యం కోసం రూ.2.54 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దేశీయ డయాబెటిక్ మందుల మార్కెట్ విలువే రూ.16,769 కోట్లు ఉన్నది.
డయాబెటిస్ బారిన పడినవారికి దీర్ఘకాలంలో కంటి, గుండె, మూత్రపిండాలు, కొలెస్టరాల్, హైపర్టెన్షన్ సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీంతో రోగులు చేయాల్సిన వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోవటమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో పౌరుల సగటు పని సామర్థ్యం దారుణంగా పడిపోతుంది. అందువల్ల దీనిని ఇక ఎంతమాత్రమూ వ్యక్తుల సమస్యగా చూడలేమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని వ్యాధి నిర్ధారణ, నివారణ, వైద్య సేవలు ప్రారంభించాలని సూచిస్తున్నారు. వీటితోపాటు డయాబెటిస్కు రోగులకు ప్రమాదరకంగా మారే జంక్ ఫుడ్, శీతల పానియాలపై పన్నులు పెంచాలని, రోగులకు ఉపయోగపడే చిరుధాన్యాల వంటి ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరుతున్నారు.
భారత్లో డయాబెటిక్ రోగులు వైద్యం, మందుల కోసం ఏటా చేస్తున్న ఖర్చు ప్రాంతాన్ని బట్టి మారుతున్నది. ప్రత్యక్షంగా నార్త్జోన్లో ఏటా రూ.18,890 ఖర్చు చేస్తుండగా, ఇది సౌత్జోన్లో రూ.10,585 ఉన్నది. అతి తక్కువగా వెస్ట్ జోన్లో రూ.8,822 ఖర్చు చేస్తుండగా, నార్త్ ఈస్ట్ జోన్లో అత్యధికంగా రూ.45,792 ఖర్చు చేస్తున్నారు. పరోక్షంగా నార్త్జోన్లో రూ.18,146 ఖర్చు చేస్తుండగా, సౌత్జోన్లో రూ.18,198, వెస్ట్ జోన్లో రూ.3,949, నార్త్ ఈస్ట్ జోన్లో రూ.18,707 ఖర్చు పెడుతున్నారు. వ్యాధి నిర్ధారణ, వైద్యం, వ్యాధి రాకుండా తీసుకొనే ముందస్తు చర్యలు, రోగుల కోసం తీసుకొనే ప్రత్యేక శ్రద్ధ తదితర వాటి కోసం చేసే ఖర్చును ప్రత్యక్ష ఖర్చుకింద చూపుతున్నారు. అనారోగ్యం వల్ల ఉద్యోగాలకు తరుచూ సెలవులు పెట్టడం, పని సామర్థ్యం తగ్గిపోవటం, శాశ్వత వైకల్యం వంటివి పరోక్ష వ్యయం కింద చూపుతున్నారు.