న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించినట్టు కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ పరిహారాన్ని రాష్ర్టాలు తమ విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి అందజేస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. పరిహారంపై ధ్రువపత్రాల పరిశీలన, పరిహారం అందజేత జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ సంఘం(డీడీఎంఏ)/జిల్లా అధికార యంత్రాంగం చేతుల్లో ఉంటుందని అఫిడవిట్లో పేర్కొన్నది. బాధిత కుటుంబం ధ్రువపత్రాలు సమర్పించిన 30 రోజుల్లో పరిహారం అందించే ప్రక్రియ పూర్తి అవుతుందని, పరిహారం చెల్లింపులో సమస్యల పరిష్కారానికి జిల్లా అడిషనల్ కలెక్టర్, వైద్యాధికారులతో కూడిన కమిటీ ఉంటుందని వెల్లడించింది. ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందని తెలిపింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఎంఏ) ఈ నెల 11నే మార్గదర్శకాలు విడుదల చేసినట్టు సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇప్పటిదాకా సంభవించిన మరణాలే కాకుండా ఇక ముందు సంభవించే కరోనా మరణాలకు కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయని వెల్లడించింది.
ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం పెంచుతుందా?
కరోనా పరిహారాన్ని రాష్ర్టాలు తమ విపత్తు నిధి నుంచి ఇస్తాయని చెప్పి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ర్టాలకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. రాష్ర్టాలకు కేటాయించే ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం పెంచుతుందా.. లేక ఇప్పుడు కేటాయిస్తున్న నిధుల నుంచే పరిహారం అందించాలా అన్నది చెప్పలేదు. కరోనా నియంత్రణ చర్యలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవడానికి కేంద్రం గతంలో అనుమతి ఇచ్చింది. మరోవైపు తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా అనేక రాష్ర్టాల్లో ఎస్డీఆర్ఎఫ్ నిధులు నిండుకొన్నాయి.