తిరువనంతపురం/భోపాల్, అక్టోబర్ 18: భారీ వర్షాలు దేవభూమి కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో పలు ప్రాంతాలు సముద్రాలను తలపిస్తున్నాయి. పతనంతిట్ట, ఇడుక్కి, త్రిస్సూర్ జిల్లాల్లోని పది డ్యామ్లలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద ప్రవాహం పెరుగడంతో కక్కి డ్యామ్ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. దీంతో పంపా నదిలో నీటి మట్టం పెరుగొచ్చని.. కాబట్టి, శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే భక్తులను తాత్కాలికంగా అనుమతించడం లేదని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ను ముంచెత్తుతున్న వానలు
ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన వానల కారణంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో నేపాల్కు చెందిన ముగ్గురు కార్మికులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. భారీవర్షాల కారణంగా ఛార్దామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, మధ్యప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది.
గొడుగు వాడితే జరిమానా!
వర్షంలో బైక్పై వెళ్తూ గొడుగును ఉపయోగిస్తే జరిమానా విధించేలా కేరళ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకువచ్చింది. బైక్ మీద వెళ్లేవారు చాలా మంది వర్షంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయినప్పుడు గొడుగులు తెరుస్తున్నారు. ఇది వారి పక్క నుంచి వెళ్లేవారికి ఇబ్బంది కలిగించడమే కాకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందుకే కేరళ ప్రభుత్వం ఈ రూల్ను తెచ్చింది.