S Jaishankar : దౌత్యం, భౌగోళిక రాజకీయాలను ఎల్లప్పుడూ త్వరిత ఫలితాల దృష్టితో అంచనా వేయలేమని విదేశాంగ మంత్రి (Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ సవాళ్లకు సహనం, దీర్ఘకాలిక నిబద్ధత అవసరమని చెప్పారు. ‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రస్తుత దౌత్యనీతి ‘టీ20 క్రికెట్’ ను పోలి ఉందా..? అనే ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.
‘అంతర్జాతీయ సంబంధాలు సుదీర్ఘమైన, అనిశ్చిత ప్రక్రియలతో కూడుకున్నవని, భౌగోళిక రాజకీయ సమస్యలకు ప్రభుత్వాలు, మీడియా త్వరితగతిన పరిష్కారాలు కోరుకుంటాయి. కానీ వీటి పరిష్కారం సుదీర్ఘకాలంలో రూపుదిద్దుకుంటుంది. అదే సమయంలో టీ20 మాదిరి మీడియాకు స్వల్పకాలిక పరిణామాలను అందించాల్సిన అవసరం ఉంది. అయితే వాస్తవ ప్రపంచంలో టెస్ట్ మ్యాచ్లూ ఉంటాయి. వాటి ఫలితాలు తక్కువ సమయంలో తేలిపోయేవి కావు. పశ్చిమాసియా యుద్ధం ఒక టీ20 మ్యాచ్లా ఉంటుందని అంతా భావించారు. కానీ అది ఏకంగా టెస్ట్ సిరీస్, అంతకంటే ఎక్కువకాలం సాగే ప్రక్రియగా మారింది’ అని పేర్కొన్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు సమస్యలు, మార్కెట్ అంతరాయాలతో కూడిన నేటి అనిశ్చిత ప్రపంచంలో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాల కోసం జైశంకర్ నాలుగు సూత్రాలను సూచించారు. అంతరాయాల నుంచి తమను తాము కాపాడుకోవడం వ్యాపార సంస్థలు, ప్రభుత్వాల ప్రాధాన్య అంశంగా ఉండాలని చెప్పారు. ‘డి-రిస్కింగ్’ తన అతిపెద్ద మంత్రమని పేర్కొన్నారు. ఎక్కువ మంది భాగస్వాములు, అధిక సంఖ్యలో సరఫరా వనరులపై ఆధారపడాలని సూచించారు. ఎన్ని ఎక్కువ ఆప్షన్లు ఉంటే అంత సురక్షితంగా ఉంటారని తెలిపారు.
ప్రపంచ మార్కెట్లు తరచూ భౌగోళిక రాజకీయాలవల్ల ప్రభావితమవుతాయనే విషయాన్ని అంగీకరించాలన్నారు. ఇంధనం, ఎరువులు, రవాణా వంటివి దీనికి ఉదాహరణలని తెలిపారు. అంతరాయాలు ఎప్పుడైనా కలగవచ్చని అంచనా వేసి ముందుగానే ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. వైవిధ్యం పాటించి, పెట్టుబడులకు భద్రత కల్పించుకోవాలని చెప్పారు.