జైపూర్: ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి వచ్చిన పెళ్లి సంబంధాలను ఒక మహిళ నిరాకరించింది (woman rejects men with government jobs). అయితే ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్న ప్రియుడైన డ్రైవర్ను చివరకు గుట్టుగా పెళ్లాడింది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. రాజస్థాన్లోని చురు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల పార్వతీ శర్మకు ఆమె తల్లిదండ్రులు చాలా పెళ్లి సంబంధాలు చూశారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది ఆమెను వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆ పెళ్లి సంబంధాలను ఆమె నిరాకరించింది.
కాగా, ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్న వ్యక్తి కోసం ఈ నెల 7న ఇంటి నుంచి పార్వతి పారిపోయింది. పికప్ వాహనం డ్రైవర్గా పని చేస్తున్న ప్రియుడు యోగేంద్రను ఆమె కలుసుకుంది. అదే రోజున తారానగర్లోని ఒక గుడిలో వారిద్దరూ గుట్టుగా పెళ్లి చేసుకున్నారు.
మరోవైపు, పెళ్లి తర్వాత ఆ జంట జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. యోగేంద్రను పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పినట్లు పార్వతి తెలిపింది. అయితే వారు ఒప్పుకోకపోవడంతో చివరకు ఇంటి నుంచి పారిపోయి ప్రియుడ్ని గుడిలో పెళ్లాడినట్లు చెప్పింది. తాను కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన పేరెంట్స్ నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెట్టారు.