న్యూఢిల్లీ, జూలై 21: సెకండ్వేవ్లో ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదంటూ కేంద్రప్రభుత్వం రాజ్యసభకు తెలుపడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఆక్సిజన్ అందక చనిపోయిన వారి కుటుంబసభ్యులు కేంద్రప్రభుత్వంపై కేసు పెట్టాలని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ పిలుపునిచ్చారు. కేంద్రం సమాధానం విన్న తర్వాత నోట మాట రాలేదన్నారు. రౌత్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ చెప్పింది విని మృతుల కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి. వారు కేంద్రంపై కేసు వేయాలి’ అని అన్నారు. ఆక్సిజన్ కొరత లేకపోతే దవాఖానలు ప్రతి రోజుకు హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రాణవాయువు కోసం ఎందుకు అర్థిస్తాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ప్రశ్నించారు. ‘ఇంకొన్ని రోజులు పోతే కేంద్రప్రభుత్వం.. దేశంలోకి కరోనా రాలేదు. అసలు కరోనా మహమ్మారి లేనే లేదు అంటుందేమో’ అని ఎద్దేవా చేశారు.
హైకోర్టులకు చెప్పింది అబద్ధమా?
విపక్షాల విమర్శలను కేంద్రం తిప్పి కొట్టింది. రాష్ర్టాలు ఇచ్చిన సమాధానం ఆధారంగానే కేంద్రప్రభుత్వం రాజ్యసభలో సమాధానం ఇచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. ఆక్సిజన్ కొరతతో చనిపోయినట్టు ఏ ఒక్క రాష్ట్రం కూడా కేంద్రానికి నివేదించలేదని, ఇప్పుడు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. తమ రాష్ర్టాల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు చనిపోయారని చెప్పడానికి ఆధారాల్లేవంటూ మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ఆయా హైకోర్టులకు నివేదించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పటికైనా లెక్క చెప్పండి
కాంగ్రెస్, శివసేన ద్వంద్వ స్వభావాలను చూస్తే ఆశ్చర్యంగా ఉందని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. ‘ఆక్సిజన్ కొరతతో మహారాష్ట్రలో సంభవించిన మరణాలు ఎన్నో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రానికి, ప్రజలకు లెక్క చెప్పాలి. ఢిల్లీకి కూడా ఇదే వర్తిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
కరోనాతో కన్నవారిని కోల్పోయిన పసిమొగ్గలు 1.19 లక్షల మంది
వాషింగ్టన్, జూలై 21: ప్రపంచ దేశాలను కకావికలం చేసిన కరోనా వైరస్ లక్షలాది కుటుంబాలకు తీరని గుండెకోతను మిగిల్చింది. కొవిడ్-19 కారణంగా 15 లక్షల మందికి పైగా చిన్నారులు.. తల్లిదండ్రులు, సంరక్షకులను (బామ్మలు, తాతయ్యలు లేదా ఇతర బంధువులు) కోల్పోయినట్టు ప్రఖ్యాత వైద్యపత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. ఒక్క భారత్లోనే 1.19 లక్షల మంది పిల్లలు తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయినట్టు వెల్లడించింది. జాబితాలో దక్షిణాఫ్రికా మొదటిస్థానంలో ఉండగా.. పెరూ, అమెరికా, భారత్, బ్రెజిల్, మెక్సికో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.