PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తన ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని చేర్చుకున్నారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్థాన్ (Ujbekistan) తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘ఓలియ్ దరాజలీ దోస్తిలిక్’ ఆర్డర్తో ఆయనను సత్కరించింది. ఆదివారం తాష్కెంట్లో జరిగిన కార్యక్రమంలో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు (Ujbekistan President) షావ్కత్ మిర్జియోయెవ్ (షావ్కత్ మిర్జియోయెవ్) ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
ఈ పురస్కారంతో ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న భారత నేతగా తన రికార్డును మరింత పదిలం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన 30కి పైగా ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. గత జూలైలోనే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘బింటాంగ్ ఆదిపుర్న’ ను మోదీకి బహూకరించిన విషయం తెలిసిందే.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్థాన్ వెళ్లిన ప్రధాని మోదీకి తాష్కెంట్లో ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు మిర్జియోయెవ్ స్వయంగా మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ఇరు నేతల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తన పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ ఓ ప్రత్యేక యోగా సెషన్ను వీక్షించారు. ఉజ్బెకిస్థాన్కు చెందిన 52 మంది యోగా అభ్యాసకులు ఇందులో పాల్గొన్నారు. వారి ప్రదర్శనను ప్రశంసించిన మోదీ, ఉజ్బెకిస్థాన్ను యోగాతో అనుసంధానిస్తున్నందుకు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఉజ్బెకిస్థాన్ యోగాను ప్రేమిస్తోంది!’ అంటూ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఏడాది జూన్లో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఆరుగురు క్రీడాకారులు కూడా ఈ ప్రదర్శనలో ఉన్నారు.