న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్పై (Covishield Side Effects) సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ను సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దేశంలో కోవిషీల్డ్ పేరుతో తయారు చేసి విక్రయించింది.
కాగా, గత నెలలో ఆస్ట్రాజెనెకా సంచలన విషయం బయటపెట్టింది. తమ టీకా తీసుకున్న వారిలో అరుదైన
సందర్భాల్లో టీటీఎస్ లేదా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ థ్రాంబోసిస్కు కారణమవుతుందని తెలిపింది. ఈ పరిస్థితి రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్కు దారితీస్తుందని పేర్కొంది.
మరోవైపు దేశంలో కూడా కోవిషీల్డ్ టీకా వేయించుకున్న పలువురు గుండెపోటుతో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ టీకా వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్పై దర్యాప్తు కోసం నిపుణుల బృందం ఏర్పాటు, టీకా తీసుకున్న తర్వాత మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్లతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించాలని పిటిషనర్ కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న కొందరు వికలాంగులుగా మారారని, వారికి కూడా నష్టపరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, ఈ పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం అంగీకరించారు. అయితే పిటిషన్పై ముందస్తు విచారణను తోసిపుచ్చారు. విచారణ తేదీ కూడా నిర్ణయించలేదు.