ఇంఫాల్, ఆగస్టు 7: అదో కుగ్రామం. జనాభా ఎంతలేదన్నా 400 మంది వరకు ఉంటారు. గ్రామాభివృద్ధి నిమిత్తం ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) పథకం కింద రూ. 20 లక్షల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డబ్బుతో ఆ గ్రామంలో తారు రోడ్లు, వీధి దీపాలు, కమ్యూనిటీ టాయ్లెట్లు, ఇంటర్నెట్ కేంద్రాలు, ఓ పక్కా స్కూల్ భవనాన్ని అధికారులు నిర్మించారు. ఎమర్జెన్సీ ఆంబులెన్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేయగా.. కొంత డబ్బు మిగిలింది. ఆ సొమ్మును గ్రామంలోని 110 మంది పేదలకు పంచిపెట్టారు. కేవలం రూ. 20 లక్షల్లో ఇన్ని పనులు పూర్తిచేయడమే కాకుండా.. ఇంకా డబ్బును మిగిల్చి పేదలకు పంచిపెట్టారా? అంత నిజాయితీపరులైన ప్రభుత్వాధికారులు ఏ రాష్ట్రంలో ఉన్నారు? అనేగా మీ సందేహం.
అయితే ఇక్కడే అసలైన తిరకాసు ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేశామంటూ అధికారులు చెబుతున్న ఆ కుగ్రామం నేలపై లేదు. నీటి మధ్యలో తేలియాడుతూ ఉంది. అవును. దేశంలోనే ఏకైక ఫ్లోటింగ్ విలేజ్ అది. పేరు చంపూ ఖాంగ్పోక్. నీటిపై తేలియాడే ఆ గ్రామంలోనే అధికారులు తారు రోడ్లు, పక్కా స్కూల్ భవనాన్ని నిర్మించినట్టు నమ్మించారు. అంతేనా 110 మంది నకిలీ లబ్ధిదారులను సృష్టించి నిధుల గోల్మాల్కు పాల్పడ్డారు. చేయని పనులు చేసినట్టు పేర్కొంటూ ప్రకటనలు ఊదరగొట్టారు. ఆ తప్పుడు ప్రకటనలే ఆర్టీఐ పిటిషన్ ద్వారా అసలు విషయాన్ని బయటకు తీసుకొచ్చేలా చేశాయి. ఈ స్కామ్ బీజేపీ పాలిత మణిపూర్లో వెలుగుచూసింది.
స్కామ్ వెలుగులోకి వచ్చిందిలా..
చంపూ ఖాంగ్పోక్ గ్రామంలో బొంగులతో నిర్మించిన ఓ స్కూల్ ఉంది. నీటిపై తేలియాడే ఆ స్కూల్కు పడవల సాయంతో విద్యార్థులు చేరుకుంటారు. అయితే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన స్థానిక అధికారులు.. గ్రామంలో కాంక్రీట్ స్కూల్ను నిర్మించినట్టు నకిలీ ఫొటోలను ముద్రించి ప్రచార కార్యక్రమాల్లో వాడారు. ఈ ఫ్లోటింగ్ విలేజ్ గురించి బాగా తెలిసిన హక్కుల కార్యకర్త రామ్ వాంగ్ఖేరాక్పామ్.. నీటిపైన పక్కా స్కూల్ను ఎలా కట్టారోనని ఆశ్చర్యపోయాడు. అంతే.. గ్రామాభివృద్ధికి విడుదలైన నిధులు, చేపట్టిన పనులను తెలియజేయాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు కోరాడు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. లబ్ధిదారులుగా పేర్కొన్న 110 మందితో పాటు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన పీఎంఏజీవై కమిటీలోని సభ్యులు కూడా నకిలీ వ్యక్తులేనని తేలింది. ప్రచార కార్యక్రమాల్లో చెబుతున్నట్టు చంపూ ఖాంగ్పోక్ గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరుగలేదని, మొత్తం నిధులను అధికారులు పక్కదారి పట్టించారని తెలిసొచ్చింది.
ముఖ్యమంత్రి గారూ.. అలాగా!
విషయం తెలుసుకున్న గ్రామస్థులు సీఎం కార్యాలయంలోని అవినీతి నిరోధక సెల్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం ఎన్ బీరేన్ సింగ్ స్పందించారు. పనుల్లో అక్రమాలు జరిగితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, గ్రామం కోసం రూ. 10 లక్షల నిధులే విడుదల చేసినట్టు ఆయన చెప్ప డం గమనార్హం. అంతేనా, చంపూ ఖాంగ్పోక్ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేమని గ్రహించిన స్థానిక నేతలు, అధికారులు.. ఆ నిధులతో పక్క గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి ఉండొచ్చు.. అంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే చెప్పుకురావడం కొసమెరుపు.