ఎంపీ బండా ప్రకాశ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించేందుకు కేంద్రం దగ్గర సరిపడా నిధుల్లేవని, అప్పు తెచ్చి చెల్లిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలపై టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాశ్ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం వద్ద అవసరమైన నిధుల్లేవని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నిధిని సమకూర్చేందుకు రూ.1.59 లక్షల కోట్లు అప్పులు తేవాలని జీఎస్టీ 43వ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందని చెప్పారు. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3,88,908 కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.1,36,524 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి అన్నారు. ఇందులో తెలంగాణకు ఇప్పటివరకు చెల్లించింది రూ.6218 కోట్లు కాగా, మరో రూ. 4073 కోట్లు చెల్లించాల్సి ఉందని కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.